హార్దిక్‌ బాదుడు.. టీమిండియాదే సిరీస్‌

6 Dec, 2020 17:23 IST|Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో గెలిచిన టీమిండియా.. రెండో టీ20లో కూడా విజయం సాధించి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. టీమిండియా 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఫలితంగా వన్డే సిరీస్‌ కోల్పోయిన దానికి ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది. శిఖర్‌ ధావన్‌(52; 36 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లు), కేఎల్‌ రాహుల్‌(30; 22 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), విరాట్‌ కోహ్లి(40; 24 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌లు), హార్దిక్‌ పాండ్యా(42 నాటౌట్‌; 22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌(12 నాటౌట్‌; 5 బంతుల్లో 1 ఫోర్‌, 1సిక్స్‌) లు రాణించి జట్టును గెలిపించారు.

ఆసీస్‌ నిర్దేశించిన 195 పరుగుల  టార్గెట్‌ను ఛేదించే క్రమంలో భారత్‌కు ధావన్‌, రాహుల్‌లు శుభారంభం అందించారు. ఈ జోడి తొలి వికెట్‌కు 56 పరుగులు జత చేసిన తర్వాత రాహుల్‌ పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో ధావన్‌తో కలిసి కోహ్లి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.  వీరిద్దరూ రెండో వికెట్‌కు 39 పరుగులు జత చేసిన తర్వాత ధావన్‌ ఔటయ్యాడు. హాఫ్‌ సెంచరీ సాధించిన కాసేపటికి ధావన్‌ పెవిలియన్‌ చేరాడు. ఆపై సంజూ సామ్సన్‌‌(15) నిరాశపరిచాడు. కోహ్లితో కలిసి 25 పరుగులు జత చేసిన తర్వాత సామ్సన్‌ ఔటయ్యాడు. ఆ తరుణంలో హార్దిక్‌-కోహ్లిల జోడి ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేసింది. కాగా, కోహ్లి మంచి దూకుడు మీద ఉన్న సమయంలో ఔట్‌ కావడంతో టీమిండియా ఒత్తిడిలో పడింది. కాగా, హార్దిక్‌-అయ్యర్‌లు సమయోచితంగా ఆడి మ్యాచ్‌ను విజయ తీరాలకు చేర్చారు. హార్దిక్‌ వీరబాదుడు బాదడంతో భారీ లక్ష్యం కాస్తా చిన్నబోయింది. చివరి రెండు ఓవర్లలో హార్దిక్‌ రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 25 పరుగులు సాధించడంతో టీమిండియా ఇంకా రెండు బంతులుండానే విజయం నమోదు చేసింది.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌  మాథ్యూ వేడ్‌ హాఫ్‌ సెంచరీకి తోడూ స్మిత్‌ కూడా రాణించడంతో రెండో టీ 20లో  టీమిండియాకు 195 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న టీమిండియా.. ముందుగా ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఫించ్‌ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్‌ మాథ్యూ వేడ్‌, మరో ఓపెనర్‌ డీఆర్సీ షాట్‌లు జట్టుకు శుభారంబాన్ని అందించారు. మొదటి 4 ఓవర్లలోనే 40 పరుగులు చేసిన ఆసీస్‌.. 47 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. 9 పరుగులు చేసిన డీఆర్సీ షాట్‌ నటరాజన్‌ బౌలింగ్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌గా వెనుదిరిగాడు. మరోవైపు ఆరంభం నుంచి దాటిగా ఆడిన వేడ్‌ 5వ ఓవర్‌లో ఠాకూర్‌ బౌలింగ్‌లో ఇచ్చిన క్యాచ్‌ను హార్ధిక్‌ జారవిడిచాడు. దీంతో 25 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. వేడ్‌కు జతకలిసిన స్టీవ్‌ స్మిత్‌ కూడా దాటిగా ఆడడంతో స్కోరుబోర్డు పరుగులెత్తింది. ఈ దశలో 58 పరుగులు చేసిన వేడ్‌ సుందర్‌ బౌలింగ్‌లో రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్‌ 2 సిక్సర్లతో 22 పరుగులు చేసి ఠాకూర్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

దీంతో 120 పరగుల వద్ద ఆసీస్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. హెన్రిక్స్‌తో కలిసి స్మిత్‌ స్కోరును పరిగెత్తించాడు.ఆసీస్‌ స్కోరు 168 పరుగులు వద్ద 46 పరుగుల చేసిన స్మిత్‌ చహల్‌ బౌలింగ్‌లో హార్దిక్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. కాసేపటికే 26 పరుగులు చేసిన హెన్రిక్స్‌ ను నటరాజన్‌ పెవిలియన్‌ చేర్చాడు. ఆ తర్వాత మార్కస్‌ స్టోయినిస్‌ మరో వికెట్‌ పడకుండా డేనియల్‌ సామ్స్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. భారత బౌలర్లలో నటరాజన్‌ 2, చహల్‌, ఠాకూర్‌లు చెరో వికెట్‌ తీశారు.ఆసీస్‌ స్కోరు 168 పరుగులు వద్ద 46 పరుగుల చేసిన స్మిత్‌ చహల్‌ బౌలింగ్‌లో హార్దిక్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. కాసేపటికే 26 పరుగులు చేసిన హెన్రిక్స్‌ ను నటరాజన్‌ పెవిలియన్‌ చేర్చాడు. ఆ తర్వాత మార్కస్‌ స్టోయినిస్‌ మరో వికెట్‌ పడకుండా డేనియల్‌ సామ్స్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. భారత బౌలర్లలో నటరాజన్‌ 2, చహల్‌, ఠాకూర్‌లు చెరో వికెట్‌ తీశారు. 

మరిన్ని వార్తలు