ఆసీస్‌తో టెస్ట్: ఆదుకున్న శార్దూల్‌, సుందర్‌

17 Jan, 2021 08:30 IST|Sakshi

హాఫ్‌ సెంచరీలతో రాణించిన శార్దూల్‌, సుందర్‌

ముగిసిన మూడోరోజు ఆట

బ్రిస్బేన్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్ట్‌లో టీమిండియా 336 పరుగుల వద్ద ఆలౌటైంది. భారత ఆటగాళ్లలో శార్దూల్‌ ఠాకూర్‌ 67 పరుగులు, వాషింగ్టన్‌ సుందర్‌ 62, రోహిత్‌ శర్మ 44, అగర్వాల్‌ 38 పరుగులతో రాణించారు. ఆసీస్‌ బౌలర్లలో హేజిల్‌వుడ్‌ 5 వికెట్లతో భారత పతనాన్ని శాసించాడు. స్టార్క్‌, కమిన్స్‌ రెండేసి వికెట్లు పడగొట్టగా.. లియోన్‌కు ఓ వికెట్‌ దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు‌ 33 పరుగులు స్వల్ప ఆధిక్యత లభించింది. అనంతరం ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ 21/0తో నిలిచింది. ప్రస్తుతం ఆసీస్‌ 55 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

కాగా 62 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడోరోజు ఆటను ప్రారంభించిన భారత్‌ను ఆసీస్‌ బౌలర్లను బోల్తాకొట్టించారు. మ్యాచ్‌ ప్రారంభమైన కాసేపటికే సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ పుజారా (24)ను హెజిల్‌వుడ్‌ ఔట్‌ చేశాడు. ఆ తరువాత యువ బ్యాట్స్‌మెన్‌ మయాంక్‌ అగర్వాల్‌తో జతకట్టిన కెప్టెన్‌ అజింక్యా రహానే జట్టును ముందుండి నడిపించాడు. 100 పరుగులకే మూడు కీలక వికెట్లను కోల్పోయిన టీంను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుండగా.. 144 పరుగుల వద్ద రహానే (37) వెనుదిరిగాడు. ఆ తరువాత అగర్వాల్‌ (38) సైతం పెవిలియన్‌ బాట పట్టాడు. దీంతో 161 పరుగులకు టీమిండియా ఐదు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరువాత పంత్‌‌ (23) కూడా వికెట్‌ సమర్పించుకున్నాడు. ఆ తరువాత క్రిజ్‌లోకి వచ్చిన ఠాకూర్‌, సుందర్‌ అద్భుతమైన బ్యాటింగ్‌తో టీమిండియాను ఆదుకున్నారు. ఏడో వికెట్‌కు 123 పరుగుల భాగస్వామ్యంతో టీంను గట్టెక్కించారు. ఆసీస్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కుని గౌరవప్రదమైన స్కోర్‌ను సాధించి పెట్టారు.

అప్‌డేట్స్‌..

  • వాషింగ్టన్‌ సుందర్‌ (144 బంతుల్లో 62) ఔట్‌
  • 67 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద శార్దూల్‌ ఠాకూర్‌ ఔట్‌ అయ్యాడు. 
  • ప్రస్తుతం క్రిజ్‌లో నవదీప్‌ సైనీ, నటరాజన్‌ ఉన్నారు.
  • తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ ఇంకా 60 పరుగులు వెనుకబడి ఉంది
  • ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో భారత బౌలర్లు శార్దూల్‌ ఠాకూర్, వాషింగ్టన్‌ సుందర్‌ అద్బుతమైన బ్యాటింగ్‌తో అదరగొడుతున్నారు. 160 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్నారు. ఆసీస్‌ బౌలర్లను ధీటుగా ఎదుర్కుంటూ ఠాకూర్‌ హాఫ్‌ సెంచరీ (54) సాధించాడు. ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లతో అదరగొట్టాడు. సుందర్‌ సైతం హాఫ్‌ సెంచరీకి సాధించి.. టీంకు అండగా నిలిచాడు. 
  • కీలకమైన బ్యాట్స్‌మెన్స్‌ అంతా ఔట్‌ అయినా వీరిద్దరూ ఆసీస్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. 180 బంతుల్ని ఎదుర్కొన్న ఈ జోడీ 105 పరుగులతో అజేయంగా సాగుతోంది. ప్రస్తుతం భారత్‌ స్కోర్‌ 290/6. (బ్రిస్బేన్‌ టెస్టుకు వర్షం దెబ్బ)
  • తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ ఇంకా 41 పరుగులు వెనుకబడి ఉంది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. కాగా రెండో రోజు వర్షం కారణంగా మ్యాచ్‌ నిలిచిపోయింది.  చివరి టెస్టు మ్యాచ్‌ రెండో రోజు శనివారం మొత్తంగా 54.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మూడో సెషన్‌లో పట్టుదలగా నిలవాల్సిన పరిస్థితి... ఇన్నింగ్స్‌ కొనసాగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో గానీ వర్షం రాకతో మ్యాచ్‌లో అనూహ్య విరామం వచ్చేసింది. మైదానం అనుకూలంగా లేకపోవడంతో మూడో సెషన్‌లో ఒక్క బంతి కూడా వేయకుండానే ఆటను రద్దు చేయాల్సి వచ్చింది.
>
మరిన్ని వార్తలు