హాఫ్ సెంచరీలతో రాణించిన శార్దూల్, సుందర్
ముగిసిన మూడోరోజు ఆట
బ్రిస్బేన్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్ట్లో టీమిండియా 336 పరుగుల వద్ద ఆలౌటైంది. భారత ఆటగాళ్లలో శార్దూల్ ఠాకూర్ 67 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 62, రోహిత్ శర్మ 44, అగర్వాల్ 38 పరుగులతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో హేజిల్వుడ్ 5 వికెట్లతో భారత పతనాన్ని శాసించాడు. స్టార్క్, కమిన్స్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. లియోన్కు ఓ వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్కు 33 పరుగులు స్వల్ప ఆధిక్యత లభించింది. అనంతరం ఆసీస్ రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 21/0తో నిలిచింది. ప్రస్తుతం ఆసీస్ 55 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
కాగా 62 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో మూడోరోజు ఆటను ప్రారంభించిన భారత్ను ఆసీస్ బౌలర్లను బోల్తాకొట్టించారు. మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే సీనియర్ బ్యాట్స్మెన్ పుజారా (24)ను హెజిల్వుడ్ ఔట్ చేశాడు. ఆ తరువాత యువ బ్యాట్స్మెన్ మయాంక్ అగర్వాల్తో జతకట్టిన కెప్టెన్ అజింక్యా రహానే జట్టును ముందుండి నడిపించాడు. 100 పరుగులకే మూడు కీలక వికెట్లను కోల్పోయిన టీంను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుండగా.. 144 పరుగుల వద్ద రహానే (37) వెనుదిరిగాడు. ఆ తరువాత అగర్వాల్ (38) సైతం పెవిలియన్ బాట పట్టాడు. దీంతో 161 పరుగులకు టీమిండియా ఐదు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరువాత పంత్ (23) కూడా వికెట్ సమర్పించుకున్నాడు. ఆ తరువాత క్రిజ్లోకి వచ్చిన ఠాకూర్, సుందర్ అద్భుతమైన బ్యాటింగ్తో టీమిండియాను ఆదుకున్నారు. ఏడో వికెట్కు 123 పరుగుల భాగస్వామ్యంతో టీంను గట్టెక్కించారు. ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కుని గౌరవప్రదమైన స్కోర్ను సాధించి పెట్టారు.
అప్డేట్స్..