ఘన విజయం: దెబ్బకు దెబ్బ కొట్టిన టీమిండియా

16 Feb, 2021 13:32 IST|Sakshi

చెన్నై: అదే మైదానం.. అవే జట్లు.. కానీ ఒక్క మ్యాచ్‌ వ్యవధిలో ఫలితం మాత్రం తారుమారు.. పర్యాటక జట్టు 227 పరుగుల తేడాతో తమను ఓడిస్తే ఆతిథ్య జట్టు అంతకు అంతా బదులు తీర్చుకుంది. 317 పరుగుల భారీ తేడాతో ప్రత్యర్థి జట్టును మట్టికరిపించి దెబ్బకు దెబ్బ కొట్టింది. పరాజయంతో అవమానభారం మూటగట్టకున్న చోటే.. అపూర్వ విజయంతో సగర్వంగా తలెత్తుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో స్పిన్నర్ల మాయాజాలంతో పర్యాటక జట్టును చిత్తు చేసింది.

తద్వారా 4 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(161) జట్టును ఆదుకుంటే.. మొత్తంగా 8 వికెట్లు పడగొట్టడమే గాకుండా అద్భుతమైన సెంచరీతో రవిచంద్రన్‌ అశ్విన్‌ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(62)తో విలువైన 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. అటు ఇంగ్లండ్‌ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి స్పిన్నర్‌ మొయిన్‌ అలీ(43) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక తొలి టెస్టులో డబుల్‌ సెంచరీతో ఆకట్టుకున్న ఇంగ్లీష్‌ జట్టు కెప్టెన్‌ జో రూట్‌(6, 33 పరుగులు) ఈ మ్యాచ్‌లో పూర్తిగా నిరాశపరిచాడు. ఇక ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 24 నుంచి మూడో టెస్టు ఆరంభం కానుంది. అహ్మదాబాద్‌(మధ్యాహ్నం 2.30 నిమిషాలకు ప్రారంభం)లో జరిగే ఈ పింక్‌బాల్‌ టెస్టులో విజయం సాధించి ఎలాగైనా సిరీస్‌లో ముందంజలో నిలవాలని కోహ్లి సేన భావిస్తోంది.
చదవండిఎట్టకేలకు కుల్దీప్‌ నవ్వాడు..!

టీమిండియా తొలి ఇన్నింగ్స్‌: 329 పరుగులు(95.5 ఓవర్లు ఆలౌట్‌)
వికెట్లు: మొయిన్‌ అలీ 4, ఓలీ స్టోన్‌ 3, జాక్‌ లీచ్‌ 2, రూట్‌ 1

రెండో ఇన్నింగ్స్‌: 286 పరుగులు(85.5 ఓవర్లు, ఆలౌట్‌)
వికెట్లు: జాక్‌ లీచ్‌ 4, మొయిన్‌ అలీ 4, ఓలీ స్టోన్‌ 1

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 134 పరుగులకు ఆలౌట్‌(59.5 ఓవర్లు):
వికెట్లు: అశ్విన్‌ 5, ఇషాంత్‌ 2, అక్షర్‌ 2, సిరాజ్‌ 1

రెండో ఇన్నింగ్స్‌: 164 ఆలౌట్‌(54.2 ఓవర్లు)
వికెట్లు: అక్షర్‌ పటేల్‌ 5, అశ్విన్ 3, కుల్దీప్‌ యాదవ్‌ 2‌

మరిన్ని వార్తలు