టీమిండియాతో చేరాను: హార్దిక్‌ పాండ్యా

4 Feb, 2021 14:33 IST|Sakshi

చెన్నై: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఇంగ్లండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. బ్యాట్‌తో పాటు బంతితో ప్రాక్టీసు చేస్తూ నెట్స్‌లో చెమట చిందిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పాండ్యా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ‘‘తిరిగి టీమిండియాతో చేరాను. సొంతగడ్డపై మ్యాచ్‌కు సిద్ధమవుతున్నాను.. రెడ్‌బాల్‌ క్రికెట్‌లో తిరిగి ప్రవేశించాను’’ అంటూ ఉద్వేగపూరిత కామెంట్‌ జతచేశాడు. ఓ వైపు బ్యాటింగ్‌ చేస్తూనే, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ సహా పేసర్‌ బుమ్రాతో బౌలింగ్‌ గురించి చర్చిస్తున్నట్లుగా ఉన్న ఈ ఫొటోలు పాండ్యా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. కాగా జనవరి 16న హార్దిక్‌ తండ్రి హిమాన్షు పాండ్యా గుండెపోటుకు గురై మరణించిన విషయం విదితమే. (చదవండి: తొలి టెస్టు: తుది జట్టులో ఎవరెవరు ఉంటే బెస్ట్‌?)

ఈ నేపథ్యంలో బాధను దిగమింగుకుని ఆటపై దృష్టి పెట్టిన పాండ్యాను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగనున్న నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన జట్టులో పాండ్యా చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 5న చెన్నైలో తొలి టెస్టు ఆరంభం కానుంది. ఇక అంతకుముందు ఆస్ట్రేలియా టూర్‌లో భాగంగా వన్డే, టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించిన హార్దిక్‌ పాండ్యాను, టెస్టు సిరీస్‌లో మాత్రం పక్కకు పెట్టారు.(చదవండి: ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌: పూర్తి షెడ్యూల్‌ ఇదే!)

ఒకవేళ అతడిని టెస్టు జట్టులో ఎంపిక చేసి ఉంటే బౌలింగ్‌ కూడా చేయాల్సి ఉంటుందని, బ్యాట్స్‌మన్‌గా  మాత్రమే  హార్దిక్‌ను టెస్టు జట్టులోకి పరిగణించలేమని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పింక్‌బాల్‌ టెస్టుకు ముందు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక అడిలైడ్‌ టెస్టులో ఘోర పరాభవం తర్వాత, పడిలేచిన కెరటంలా రహానే సారథ్యంలోని భారత జట్టు ఆసీస్‌కు వరుస షాక్‌లు ఇచ్చి బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానం దక్కించుకుంది.

మరిన్ని వార్తలు