India Vs Ireland T20: ఐర్లాండ్‌తో సిరీస్‌.. నాడు తుది జట్టులో డీకే.. డ్రింక్స్‌ మోసిన ధోని! వైరల్‌!

25 Jun, 2022 15:07 IST|Sakshi
నాడు డ్రింక్స్‌ అందిస్తున్న ధోని(PC: Twitter)

India vs Ireland T20 Series: మహేంద్ర సింగ్‌ ధోని.. మిస్టర్‌ కూల్‌.. సింప్లిసిటీకి మారుపేరు.. యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో మేటి.. అంతేనా జట్టు ప్రయోజనాల కోసం తన స్థానాన్ని కూడా త్యాగం చేయగలడు.. తాను అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్న సమయంలో ఎన్నో సార్లు ఈ విషయాన్ని నిరూపించాడు ధోని.

ఇక ఐర్లాండ్‌తో టీమిండియా జూన్‌ 26 నుంచి టీ20 సిరీస్‌ ఆడనున్న నేపథ్యంలో ధోని సింప్లిసిటీకి సంబంధించిన ఫొటోలు తాజాగా వైరల్‌ అవుతున్నాయి. కాగా 2018లో భారత జట్టు ఐర్లాండ్‌లో పర్యటించింది. విరాట్‌ కోహ్లి కెప్టెన్సీలో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడింది.

ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ధోని 5 బంతులు ఎదుర్కొని 11 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ క్రమంలో రెండో మ్యాచ్‌లో ధోని స్థానంలో మరో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌ తుది జట్టులోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో ధోని వాటర్‌బాయ్‌ అవతారం ఎత్తాడు. టీమిండియా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో సహచర ఆటగాళ్లకు డ్రింక్స్‌ అందించాడు.

ఇందుకు సంబంధించిన ఫొటోలు అప్పట్లో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజా సిరీస్‌ నేపథ్యంలో అభిమానులు వాటిని వెలికి తీసి రీషేర్‌ చేస్తున్నారు. ఇవి చూసిన నెటిజన్లు ధోని నిరాడంబరతకు అద్దం పట్టే దృశ్యాలు ఇవి అంటూ అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక 2018 సిరీస్‌ విషయానికొస్తే కోహ్లి సేన మొదటి మ్యాచ్‌లో 76, రెండో మ్యాచ్‌లో 143 పరుగుల భారీ తేడాతో గెలుపొంది ట్రోఫీ సొంతం చేసుకుంది. అయితే, ధోని స్థానంలో రెండో మ్యాచ్‌కు జట్టులోకి వచ్చిన డీకేకు బ్యాటింగ్‌ చేసే అవకాశమే రాలేదు. తొలి టీ20లో కుల్దీప్‌ యాదవ్‌(4 వి​కెట్లు), రెండో టీ20లో కేఎల్‌ రాహుల్‌ (36 బంతుల్లో 70 పరుగులు)ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులు అందుకున్నారు. 
చదవండి: Rajat Patidar: రజత్‌ పాటిదార్‌ సెంచరీ.. ముగ్గురు మొనగాళ్ల విజృంభణ.. ముంబైకి చుక్కలు!

మరిన్ని వార్తలు