India Vs SA: భారత అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. కొత్త కెప్టెన్‌ వచ్చేస్తున్నాడు!

26 Dec, 2021 09:04 IST|Sakshi

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ముందు భారత్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌. గాయం కారణంగా టెస్ట్‌ సిరీస్‌కు దూరమైన రోహిత్ శర్మ దక్షిణాఫ్రికాతో వన్డేలకు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నేషనల్‌ క్రికెట్‌ ఆకాడమీలో ఉన్న రోహిత్‌ ప్రాథమిక ఫిట్‌నెస్ పరీక్షలో నెగ్గినట్లు సమాచారం. సోమవారం  రోహిత్‌ మరోసారి ఫిట్‌నెస్ పరీక్షకు హాజరు కానున్నాడు. ఈ పరీక్షలో రోహిత్‌ నెగ్గితే వన్డే సిరీస్‌కు రోహిత్‌ అందుబాటులో ఉండనున్నాడు. ఇక దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు భారత జట్టు వన్డే కెప్టెన్‌గా కోహ్లిని తొలిగించి రోహిత్‌ని నియమించిన సంగతి తెలిసిందే.

"రోహిత్ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు. అతడు తన గాయం నుంచి పూర్తి స్ధాయిలో కోలుకున్నాడు. ప్రాథమిక ఫిట్‌నెస్ పరీక్షలో రోహిత్‌ ఉత్తీర్ణత సాధించాడు. అతడు ఇంకా ఎన్సీఏ లోనే ఉన్నాడు. రోహిత్‌ సోమవారం​ మరోసారి ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాల్గోనున్నాడు. ఈ పరీక్ష ఆధారంగా మేము తుది నిర్ణయం తీసుకుంటాం" అని ఎన్సీఏ అధికారి ఒకరు తెలిపారు. కాగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు మరో రెండు రోజుల్లో జట్టును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. జట్టు ఎంపికలో యువ ఆటగాళ్లు రుత్‌రాజ్‌ గైక్వాడ్‌, వెంకటేశ్‌ అయ్యర్‌ను పరిగణలోకి తీసుకోనున్నట్లు సమాచారం. ఇక టెస్ట్‌ సిరీస్‌ ముగిశాక భారత్‌ దక్షిణాఫ్రికాతో మూడు వన్డేలు ఆడనుంది.

చదవండి: Vijay Hazare Trophy 2021:తమిళనాడుతో హిమాచల్‌ ప్రదేశ్‌ ఫైనల్‌ పోరు... ధావన్‌ మళ్లీ మెరిసేనా!

మరిన్ని వార్తలు