భారత్తో‌ సిరీస్‌ కాంట్రాక్ట్‌పై సంతకం చేయని శ్రీలంక క్రికెటర్లు..

2 Jul, 2021 17:35 IST|Sakshi

కొలొంబో: భారత్‌తో కీలకమైన వన్డే, టీ20 సిరీస్ ముంగిట శ్రీలంక క్రికెట్ బోర్డుకి ఆ జట్టు ఆటగాళ్లు ఊహించని షాకిచ్చారు. షెడ్యూల్ ప్రకారం లంక జట్టు జులై 13 నుంచి కొలంబో వేదికగా భారత్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. ఈ మేరకు ధవన్‌ నేతృత్వంలోని భారత జట్టు ఇప్పటికే కొలంబోకి చేరుకుని క్వారంటైన్‌ను కూడా కంప్లీట్‌ చేసింది. ఈ నేపథ్యంలో శ్రీలంకకి చెందిన ఐదుగురు క్రికెటర్లు.. భారత్‌తో సిరీస్‌కి సంబంధించిన కాంట్రాక్ట్‌పై సంతకం చేసేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. శ్రీలంక క్రికెట్ బోర్డు, ఆ దేశ ఆటగాళ్ల మధ్య కాంట్రాక్ట్‌కి సంబంధించి గత కొన్నిరోజులుగా వివాదం నడుస్తోంది.

ఈ నేపథ్యంలో.. కాంట్రాక్ట్‌పై సంతకం చేసేందుకు శ్రీలంక క్రికెటర్లు విశ్వ ఫెర్నాండో, లాహిరు కుమార, అషేన్ బండార, కసున్ రజిత, లసిత్ ఎంబుల్‌దెనియా నిరాకరించారు. లంక బోర్డు నేషనల్ కాంట్రాక్ట్‌ నిమిత్తం మొత్తం 24 మంది క్రికెటర్లకి ఆఫర్ చేయగా.. ఈ ఐదుగురు మాత్రం తాము సంతకం చేసేది లేదని బోర్డుకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇంగ్లాండ్ టూర్‌లో బయో బబుల్‌ నిబంధనల్ని అతిక్రమించిన కుశాల్ మెండిస్, గుణతిలక, డిక్లెల్వా సస్పెండ్ అయిన నేపథ్యంలో భారత్‌తో సిరీస్‌పై అనుమానాలు నెలకొన్నాయి.

మరిన్ని వార్తలు