CWG 2022: బార్బడోస్‌పై ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా మహిళలు

4 Aug, 2022 07:05 IST|Sakshi

కామన్‌వెల్త్‌ గేమ్స్‌ 2022లో టీమిండియా మహిళల జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. గేమ్స్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా వుమెన్స్‌ జూలు విదిల్చారు. బుధవారం బార్బడోస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మహిళలు 100 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించారు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా మహిళలు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్‌(46 బంతుల్లో 56 నాటౌట్‌, 6 ఫోర్లు, ఒక సిక్స్‌) టాప్‌ స్కోరర్‌ కాగా.. షఫాలీ వర్మ(26 బంతుల్లో 43, 7 ఫోర్లు, 1 సిక్సర్‌), చివర్లో దీప్తి శర్మ(28 బంతుల్లో 34, 2 ఫోర్లు, 1 సిక్సర్‌) దుమ్మురేపడంతో భారత్‌ మహిళల జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన బార్బడోస్‌ మహిళల జట్టు భారత్‌ బౌలర్ల ఒత్తిడిని తట్టుకోలేక 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 62 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ ముగించింది.

కోషోనా నైట్‌ 16 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. మిగతావారు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. టీమిండియా వుమెన్స్‌ బౌలర్లలో రేణుకా సింగ్‌ 4 వికెట్లు తీయగా.. మేఘనా సింగ్‌, స్నేహ్ రాణా, రాదా యాదవ్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌లు తలా ఒక వికెట్‌ తీశారు. ఇక న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ మధ్య విజేతతో టీమిండియా మహిళల జట్టు సెమీస్‌లో తలపడనుంది. సెమీస్‌లో గెలిస్తే మాత్రం టీమిండియా మహిళల జట్టుకు పతకం ఖాయమైనట్లే.

మరిన్ని వార్తలు