Asia Cup: సత్తా చాటిన భారత ఆర్చర్లు.. ఆసియాకప్‌లో మూడు స్వర్ణాలు

11 May, 2022 07:26 IST|Sakshi

సులేమానియా (ఇరాక్‌): ఆసియా కప్‌ ఆర్చరీలో భారత గురి అదిరింది. మంగళవారం జరిగిన పోటీల్లో మన ఆర్చర్లు 3 స్వర్ణాలు, ఒక కాంస్య పతకం గెలుపొందారు. మహిళల కాంపౌండ్‌ టీమ్‌ ఈవెంట్‌ ఫైనల్లో పర్నీత్‌ కౌర్, అదితి స్వామి, సాక్షి చౌదరీలతో కూడిన భారత జట్టు  204–201తో కజకిస్తాన్‌ జట్టును ఓడించి బంగారు పతకం గెలిచింది. పురుషుల ఫైనల్లో ప్రథమేశ్, రిషభ్‌ యాదవ్, సమాధాన్‌ బృందం 224–218తో బంగ్లాదేశ్‌ను ఓడించి స్వర్ణం సాధించింది.

ఇక మూడో స్వర్ణం కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో ప్రథమేశ్‌–పర్నీత్‌ కౌర్‌ సాధించారు. ఫైనల్లో ఈ జోడీ 158–151తో అదిలజెక్సెంబినొవా–క్రిస్టిచ్‌ (కజకిస్తాన్‌) జంటపై గెలిచింది. వ్యక్తిగత కాంపౌండ్‌ విభాగంలో జరిగిన కాంస్య పతక పోరులో సమాధాన్‌ 147–145తో సెర్గెయ్‌ క్రిస్టిచ్‌ (కజకిస్తాన్‌)పై గెలిచి రెండో పతకం తన ఖాతాలో వేసుకున్నాడు. నేడు భారత ఆర్చర్లు పది పతకాల  కోసం పోటీపడనున్నారు. 

మరిన్ని వార్తలు