ముంబై: ఆస్ట్రేలియా టూర్ను విజయవంతంగా ముగించి.. ట్రోఫీతో భారత క్రికెట్ జట్టు సభ్యులు సగర్వంగా స్వదేశం చేరారు. విమానాశ్రయాల్లో వారికి ఘన స్వాగతం లభించింది. ఆస్ట్రేలియా నుంచి జట్టు సభ్యులు గురువారం భారత్కు చేరుకున్నారు. ముంబైలో కెప్టెన్ అజింక్య రహానే, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రవిశాస్త్రి, ఓపెనర్ పృథ్వీ షా దిగగా.. బ్రిస్బెన్ టెస్ట్లో హీరోగా నిలిచిన రిషబ్ పంత్ ఢిల్లీలో అడుగుపెట్టాడు. ఇక టెస్ట్లో సత్తా చాటిన మహ్మద్ సిరాజ్ హైదరాబాద్ చేరుకున్నాడు. ఆటగాళ్లకు విమానాశ్రయ సిబ్బందితో పాటు అభిమానులు, ప్రయాణికులు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఢిల్లీలో దిగిన అనంతరం రిషబ్ పంత్ మీడియాతో మాట్లాడారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. సిరీస్ మొత్తం ఆడిన తీరుపై జట్టు అంతా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.