Kohli-Ashneer Grover: కోహ్లిని కలిసిన వివాదాస్పద పారిశ్రామికవేత్త

22 Sep, 2022 10:48 IST|Sakshi

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిని ప్రముఖ పారిశ్రామికవేత్త.. ఢిల్లీకి చెందిన అశ్నీర్‌ గ్రోవర్‌ బుధవారం రాత్రి కలుసుకున్నాడు. ఇద్దరు చాలాసేపు పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. తమ మధ్య ఉన్న పాత అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ''ఢిల్లీకి చెందిన ఇద్దరు కుర్రాళ్లు మాట్లాడుకుంటున్నారంటే ఎవరికైనా ఆసక్తి ఉంటుంది.. నాగ్‌పూర్‌ టి20కి ఆల్‌ ది బెస్ట్‌ విరాట్‌ కోహ్లి'' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. వీరిద్దరి ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇ​క అశ్నీర్‌ గ్రోవర్‌ పరిచయం అక్కర్లేని పేరు. భారత్‌పే ఫౌండర్‌గా, అతని భార్య మాధురి జైన్‌ కంట్రోల్స్‌ ఆఫ్‌ హెడ్‌ హోదాలో అవినీతికి పాల్పడారంటూ ఆరోపణలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే సంస్థ సొమ్ముతో వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించుకున్నారు. భోగ భాగ్యాలు అనుభవించారు. కోటి రూపాయలు డైనింగ్‌ టేబుల్‌, మూడున్నర కోట్ల కారు ఉందంటూ గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకున్నారు. చివరికి చేసిన పాపం ఊరికే పోదన్నట్లు మహీంద్రా కోటక్‌ బ్యాంక్‌కి చెందిన మహిళా అధికారిని దుషించారు. సంబంధిత ఆడియో సంభాషణలు వెలుగులోకి రావడంతో అశ్నీర్‌ కథ అడ్డం తిరిగింది. చివరికి అవమానకర రీతిలో సంస్థ నుంచి వైదొలగాల్సి వచ్చింది.

ఇక కోహ్లి.. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే జరిగిన తొలి టి20లో టీమిండియా పరాజయం పాలైంది. ఫేలవమైన ఫీల్డింగ్‌, బౌలింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. శుక్రవారం నాగ్‌పూర్‌ వేదికగా జరగనున్న రెండో టి20 ఆడేందుకు ఇరుజట్ల ఆటగాళ్లు అక్కడికి చేరుకున్నారు. ఇక ఆసియా కప్‌లో అఫ్గానిస్తాన్‌పై సెంచరీతో మెరిసిన కోహ్లి ఫామ్‌లోకి వచ్చాడనేలోపే.. ఆసీస్‌తో జరిగిన తొలి టి20లో రెండు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. రెండో టి20లో ఎలాగైనా రాణించాలని కోహ్లి పట్టుదలతో ఉన్నాడు. 

చదవండి: కోహ్లి, ధావన్‌ల తర్వాత స్మృతి మందానకే సాధ్యమైంది..

మరిన్ని వార్తలు