రాయ్పూర్: రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్లో భాగంగా వెస్టిండీస్ లెజెండ్స్తో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్లో ఇండియా లెజెండ్స్ బ్యాట్స్మెన్ల ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. దిగ్గజ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్(42 బంతుల్లో 65; 6ఫోర్లు, 3సిక్సర్లు), సిక్సర్ల షాహెన్షా యువరాజ్ సింగ్(20 బంతుల్లో 49 నాటౌట్; ఫోర్, 6 సిక్సర్లు) పరుగుల వరదపారించారు. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(17 బంతుల్లో 35; 5 ఫోర్లు, సిక్స్) మెరుపు ఆరంభానివ్వగా, సచిన్, కైఫ్(21 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), యూసఫ్ పఠాన్(20 బంతుల్లో 37 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), యువరాజ్ తమదైన మార్క్ షాట్లతో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు. విండీస్ బౌలర్ నగముత్తు వేసిన 19వ ఓవర్లో యువీ ఏకంగా నాలుగు సిక్సర్లు బాది 24 రన్స్ రాబట్టాడు. భారత బ్యాట్స్మెన్ల వీరవిహారం ధాటికి విండీస్ బౌలర్లు ప్రేక్షకపాత్రకు పరిమితమయ్యారు.