పృథ్వీ షాకు చేదు అనుభవం.. అడ్డుకున్న పోలీసులు

14 May, 2021 15:41 IST|Sakshi

ముంబై: టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షాకు చేదు అనుభవం ఎదురైంది. మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ అమల్లో ఉండడంతో అధికారుల అనుమతి లేకుండా గోవాకు వెళుతున్న పృథ్వీ షాను అంబోలీ జిల్లా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. విషయంలోకి వెళితే.. కరోనా సెగతో  ఐపీఎల్‌ 14వ సీజన్‌ను బీసీసీఐ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పృథ్వీ షా హోం ఐసోలేషన్‌ను ఇటీవలే పూర్తి చేసుకున్నాడు.

కాగా ఇటీవలే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు పృథ్వీ షాను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. దీంతో పృథ్వీ కాస్త సమయం దొరకడంతో గోవాకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ కేంద్రం అన్ని విమానాలపై నిషేధం విధించింది. దీంతో తన సొంత కారులో పృథ్వీ షా గోవాకు బయలుదేరాడు. అయితే కరోనా విజృంభిస్తున్న వేళ మహారాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లాలన్న ఈ పాస్‌ ఉంటేనే పోలీసులు అనుమతి ఇస్తున్నారు. అయితే పృథ్వీ షా వద్ద ఈ పాస్‌ లేకపోవడంతో అంబోలీ జిల్లా చెక్‌పోస్టు వద్ద పోలీసులు అతని కారును అడ్డుకున్నారు. ఈ పాస్‌ లేకపోవడంతో గోవా వెళ్లడం కుదరదన్నారు. పృథ్వీ షా ఎన్నిసార్లు అడిగినా పోలీసులు ఒప్పుకోకవడంతో.. గంటపాటు  వేచిఉండి తన మొబైల్‌ నుంచే ఈ పాస్‌ అప్లై చేయగా.. అనుమతి వచ్చిన తర్వాత పోలీసులు ఒప్పుకున్నారు.

ఇక ఆసీస్‌ పర్యటనలో ఘోరంగా విఫలం కావడంతో ఉద్వాసనకు గురైన పృథ్వీ ఆ తర్వాత దేశవాలీ టోర్నీ అయిన విజయ్‌ హజారే ట్రోపీలో దుమ్మురేపాడు. నాలుగు సెంచరీలు సాధించి 800 పరుగులతో టోర్నీలో టాప్‌ స్కోరర్‌గా నిలిచి తిరిగి ఫామ్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత జరిగిన ఐపీఎల్‌ 14వ సీజన్‌లోనూ అదే జోరును కంటిన్యూ చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున 8 మ్యాచ్‌ల్లో 308 పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ముఖ్యంగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా 41 బంతుల్లోనే 82 పరుగులు సాధించాడు.  
చదవండి:  పృథ్వీ షా ముందు బరువు తగ్గు.. ఆ తర్వాత చూద్దాం!

>
మరిన్ని వార్తలు