County Championship 2022: టీమిండియా పేసర్ నవదీప్ సైనీ కౌంటీ చాంపియన్షిప్ ఎంట్రీలోనే అదరగొట్టాడు. కెంట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు అరంగేట్రంలోనే ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా కెంట్.. వార్విక్షైర్తో తలపడుతోంది.
ఈ మ్యాచ్ ద్వారా కౌంటీల్లో అడుగు పెట్టిన సైనీ.. వార్విక్షైర్ మొదటి ఇన్నింగ్స్లో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు. క్రిస్ బెంజమిన్, డాన్ మూస్లే, మిచెల్ బర్గ్స్ , హెన్రీ బ్రూక్స్, క్రెయిగ్ మిల్స్లను అవుట్ చేశాడు.
Five wickets on debut: @navdeepsaini96 🏎 pic.twitter.com/6wzYjE8N1d
— Kent Cricket (@KentCricket) July 20, 2022
ద్రవిడ్ తర్వాత ఆ ఘనత సైనీదే!
టెస్టు స్పెషలిస్టు ఛతేశ్వర్ పుజారా సహా పలువురు టీమిండియా క్రికెటర్లు కౌంటీ చాంపియన్షిప్-2022లో ఆడుతున్న విషయం తెలిసిందే. పుజారా ససెక్స్కు, ఉమేశ్ యాదవ్ మిడిల్సెక్స్ తరఫున, వాషింగ్టన్ సుందర్ లంకాషైర్ తరఫున ఆడుతున్నారు. కాగా వాషింగ్టన్ సుందర్ సైతం తొలి మ్యాచ్లోనే ఐదు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.
ఇక సైనీ కెంట్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా గతంలో టీమిండియా వాల్, ప్రస్తుత హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ జట్టుకు ఆడాడు. ఆ తర్వాత కెంట్కు ఆడుతున్న ఘనత నవదీప్ సైనీకే దక్కింది. ఇదిలా ఉంటే.. రాయల్ వన్డే చాంపియన్షిప్లో భాగంగా కృనాల్ పాండ్యా వార్విక్షైర్కు ఆడనున్నాడు.
పాపం.. బౌలర్లు రాణించినా..
మ్యాచ్ విషయానికొస్తే.. జూలై 19న కెంట్తో ఆరంభమైన మ్యాచ్లో టాస్ గెలిచిన వార్విక్షైర్ తొలి ఇన్నింగ్స్ను 225 పరుగుల వద్ద ముగించింది. కెంట్ బౌలర్లలో సైనీ ఐదు వికెట్లు తీయగా.. మ్యాట్ హెన్రీ రెండు, మిల్న్స్ మూడు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే, బ్యాటర్లు విఫలం కావడంతో 165 పరుగులకే కెంట్ కుప్పకూలింది. వర్షం కారణంగా మూడో రోజు ఆట ఆలస్యమైంది.
చదవండి: Ind Vs WI ODI Series: వీళ్లతో అంత వీజీ కాదు! ఏమరపాటుగా ఉంటే మూల్యం చెల్లించకతప్పదు!