Pujara-Mohammad Rizwan: ఒకే ఫ్రేమ్‌లో దాయాది క్రికెటర్లు; అరుదైన దృశ్యం అంటున్న ఫ్యాన్స్‌

14 Apr, 2022 19:57 IST|Sakshi

టీమిండియా టెస్టు స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారా ప్రస్తుతం కౌంటీల్లో ఆడేందుకు లండన్‌లో వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఫామ్‌ కోల్పోయి సతమతవుతున్న పుజారా మళ్లీ ఫామ్‌ను అందిపుచ్చుకునే ప్రయత్నంలో ఉ‍న్నాడు. ఈ నేపథ్యంలోనే ఈసారి కౌంటీల్లో ససెక్స్‌ తరపున పుజారా అరంగేట్రం చేయనున్నాడు.  ఇదే సమయంలో పాకిస్తాన్‌ స్టార్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ కూడా ససెక్స్‌ తరపునే కౌంటీల్లో అరంగేట్రం చేయనున్నాడు.  

తాజాగా ఈ ఇద్దరు ఒకే ఫ్రేమ్‌లో ఫోటోకు ఫోజిచ్చారు. ఒకరు టీమిండియాకు ఆడుతుంటే.. మరొకరు మన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌కు ఆడుతున్నాడు. ఎంతైనా టీమిండియా-పాకిస్తాన్‌ అంటే చాలు ఎక్కడున్నా సరే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అందుకే వీరిద్దరు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంపై ట్విటర్‌లో అభిమానులు ఆసక్తికరంగా కామెంట్స్‌ చేశారు. స్వాతంత్య్రం ఇచ్చే సందర్భంలో బ్రిటీష్‌ ప్రభుత్వం భారత్‌, పాకిస్తాన్‌లను విడగొట్టింది..ఇప్పుడదే బ్రిటీష్‌ మళ్లీ కలిపింది.. ఇలాంటివి అరుదుగా జరుగుతుంటాయి.. ఒకసారి టీమిండియా, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ జరిగితే చూడాలనిపిస్తుంది అంటూ కామెంట్‌ చేశారు. 

ఇక చతేశ్వర్‌ పుజారా ఇప్పటికే తనేంటో నిరూపించుకున్నాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో పుజారా తన మార్క్‌ చూపించాడు. ద్రవిడ్‌ తర్వాత అడ్డుగోడ అనే పేరును సార్థకం చేసుకున్నాడు. ఇప్పుడు ఫాం కోల్పోయి సతమతవుతున్నప్పటికి తనదైన రోజున పుజారాను ఆపడం ఎవరి తరం కాదు. ఇక అటు మహ్మద్‌ రిజ్వాన్‌ కూడా పాకిస్తాన్‌ క్రికెట్‌లో కీలకంగా ఎదుగుతున్నాడు. ఇటీవలే ఐసీసీ టి20 ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును అందుకున్నాడు. 

చదవండి: IND vs PAK: కన్నేసి ఉంచాలంటూ పాక్‌ ఆటగాళ్ల భార్యలను భారత్‌కు పంపించాం!

మరిన్ని వార్తలు