పృథ్వీ షా ముందు బరువు తగ్గు.. ఆ తర్వాత చూద్దాం!

8 May, 2021 15:51 IST|Sakshi

ఢిల్లీ: జూన్‌లో న్యూజిలాండ్‌తో జరగనున్న వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు బీసీసీఐ టీమిండియా జట్టును ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. 20 మంది ప్రాబబుల్స్‌తో కూడిన ఆ జట్టలో హార్దిక్‌ పాండ్యాతో పాటు పృథ్వీ షా, కుల్దీప్‌, భువనేశ్వర్‌లను ఎంపిక చేయలేదు. మిగతావారి సంగతి ఎలా ఉ‍న్నా పృథ్వీ షా జట్టుకు ఎంపికకాకపోవడం కాస్త ఆశ్చర్యం కలిగించింది. వాస్తవానికి ఆసీస్‌ పర్యటనలో ఘోరంగా విఫలం కావడంతో ఉద్వాసనకు గురైన పృథ్వీ ఆ తర్వాత దేశవాలీ టోర్నీ అయిన విజయ్‌ హజారే ట్రోపీలో దుమ్మురేపాడు. నాలుగు సెంచరీలు సాధించి 800 పరుగులతో టోర్నీలో టాప్‌ స్కోరర్‌గా నిలిచి తిరిగి ఫామ్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత జరిగిన ఐపీఎల్‌ 14వ సీజన్‌లోనూ అదే జోరును కంటిన్యూ చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున 8 మ్యాచ్‌ల్లో 308 పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ముఖ్యంగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా 41 బంతుల్లోనే 82 పరుగులు సాధించాడు.

అయితే పృథ్వీ షాను జట్టులోకి ఎంపిక చేయకపోవడానికి అతను ఎక్కువ వెయిట్‌ ఉండడమే కారణమని.. అందుకే అతన్ని బీసీసీఐ పరిగణలోకి తీసుకోలేదంటూ వార్తలు వచ్చాయి. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చిన నివేదిక ప్రకారం పృథ్వీ షా కాస్త వెయిట్‌ తగ్గాల్సి ఉందని.. అందుకు రిషబ్‌ పంత్‌ను ఉదాహరణగా తీసుకోవాలని బీసీసీఐ సూచించినట్లు సమాచారం. పంత్‌ కూడా వెయిట్‌ లాస్‌ అయ్యాకే తిరిగి జట్టులోకి వచ్చి దుమ్మురేపుతున్నాడని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నట్లు సమాచారం. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో సదరు అధికారి మాట్లాడుతూ.. '' పృథ్వీకి ఇప్పుడు 21 ఏళ్లే.. ఆసీస్‌ పర్యటనలో అతను ఫీల్డింగ్‌లోనూ వెనుకబడ్డాడు. బంతులు ఆపడంలో ఇబ్బంది పడిన షా పలు క్యాచ్‌లు కూడా వదిలేశాడు. దీనికి అతను ఎక్కువ వెయిట్‌ ఉండడమే కారణం. కానీ ఆసీస్‌ టూర్‌ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతను ఆటలో జోరు ప్రదర్శిస్తున్నాడు. తన బ్యాటింగ్‌లో తప్పులను సరిచేసుకుంటూ వస్తున్నాడు. ఇకముందు కూడా ఇలాంటి ప్రదర్శన చేస్తే తప్పకుండా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది'' అంటూ పేర్కొన్నాడు.
చదవండి: బెల్లీ డ్యాన్స్‌తో రచ్చ చేసిన పృథ్వీ షా గర్ల్‌ఫ్రెండ్‌

పృథ్వీ షాకు పూనకం.. తల పట్టుకున్న శివమ్‌ మావి

మరిన్ని వార్తలు