World Shooting Championship: ఇషా జట్టుకు స్వర్ణం 

19 Oct, 2022 07:12 IST|Sakshi

కైరో (ఈజిప్ట్‌): ప్రపంచ షూటింగ్‌ చాంపియన్‌ షిప్‌లో భారత షూటర్ల పసిడి వేట కొనసాగుతోంది. ఈ మెగా ఈవెంట్‌లో తాజాగా భారత్‌కు మరో మూడు స్వర్ణ పతకాలు లభించాయి. జూనియర్‌ మహిళల ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్, వర్షా సింగ్, శిఖా నర్వాల్‌లతో కూడిన భారత జట్టు పసిడి పతకం గెలిచింది. ఫైనల్లో భారత్‌ 16–6తో చైనా జట్టును ఓడించింది.

జూనియర్‌ మహిళల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఫైనల్లో తిలోత్తమా సేన్, నాన్సీ, రమితాలతో కూడిన భారత జట్టు 16–2తో చైనా జట్టుపై గెలిచి స్వర్ణం నెగ్గింది. జూనియర్‌ పురుషుల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఫైనల్లో శ్రీ కార్తీక్‌ శబరి రాజ్, దివ్యాంశ్‌ సింగ్‌ పన్వర్, విదిత్‌ జైన్‌లతో కూడిన భారత జట్టు 17–11తో చైనా జట్టుపై గెలిచి బంగారు పతకం సాధించింది. ఇప్పటి వరకు ఈ టోరీ్నలో భారత్‌ 9 స్వర్ణాలు, 3 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి మొత్తం 20 పతకాలతో రెండో స్థానంలో ఉంది. 

మరిన్ని వార్తలు