బ్రిస్బేన్‌లో టెస్టు ఆడతాం: బీసీసీఐ

10 Jan, 2021 06:22 IST|Sakshi

సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు వేదిక విషయంలో సందిగ్ధత వీడింది. బ్రిస్బేన్‌లో ఈ మ్యాచ్‌ ఆడేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)కు బీసీసీఐ సమాచారం అందించింది. అయితే మ్యాచ్‌ ముగిశాక ఒక్క రోజు కూడా తాము అక్కడ ఉండబోమని, వెంటనే భారత్‌కు వెళ్లిపోయే ఏర్పాట్లు చేయాలని కోరింది. ‘చివరి టెస్టు ముగిసిన వెంటనే భారత్‌కు తిరిగి వెళ్లే ఏర్పాట్లు చేయమని వారిని కోరాం.

అందుబాటులో ఉన్న మొదటి ఫ్లయిట్‌లోనే పంపిస్తే మంచిది. వీలుంటే మ్యాచ్‌ ముగిసిన రాత్రి కూడా అక్కడ ఆగకుండా బయల్దేరాలని భావిస్తున్నాం’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో ప్రేక్షకులను అనుమతించడం లేదని బోర్డు స్పష్టం చేసింది. కఠిన బయో బబుల్‌ వాతావరణంలో క్రికెటర్లు ఉండబోతున్నారని, ఇలాంటి స్థితిలో తాము రిస్క్‌ తీసుకోలేం కాబట్టి అభిమానులను ఒక్క మ్యాచ్‌కూ అనుమతించమని వెల్లడించింది. 

మరిన్ని వార్తలు