ఒలింపియాడ్‌ సెమీస్‌లో భారత్‌ 

14 Sep, 2021 07:29 IST|Sakshi

చెన్నై: ‘ఫిడే’ ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌లో భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఉక్రెయిన్‌ జట్టుతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ ‘బ్లిట్జ్‌ టైబ్రేక్‌’లో 5–1తో నెగ్గింది. భారత విజయంలో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక కీలకపాత్ర పోషించింది. ఆమె ఆడిన మూడు గేముల్లోనూ నెగ్గింది. ముందుగా ఉక్రెయిన్‌తో తొలి మ్యాచ్‌లో భారత్‌ 4–2తో గెలుపొంది....రెండో మ్యాచ్‌లో 2.5–3.5తో ఓడిపోయింది. దాంతో రెండు జట్ల స్కోరు సమమైంది.

విజేతను నిర్ణయించడానికి టైబ్రేక్‌ నిర్వహించగా భారత్‌ పైచేయి సాధించింది. టైబ్రేక్‌ గేముల్లో భారత్‌ తరఫున ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక, ఆధిబన్, నిహాల్‌ సరీన్, వైశాలి నెగ్గగా... కోనేరు హంపి, విదిత్‌ తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. హారిక 37 ఎత్తుల్లో నటాలియా బుక్సాను ఓడించగా... లులీజా ఉస్మాక్‌తో గేమ్‌ను హంపి 65 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. అంతకుముందు తొలి మ్యాచ్‌ గేమ్‌లో హారిక 36 ఎత్తుల్లో నటాలియా బుక్సాపై, రెండో మ్యాచ్‌ గేమ్‌లో 32 ఎత్తుల్లో జుకోవాపై గెలిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో అమెరికాతో భారత్‌  తలపడుతుంది. 

మరిన్ని వార్తలు