Womens World Chess Championship 2021: చరిత్ర సృష్టించిన అమ్మాయిలు

2 Oct, 2021 07:49 IST|Sakshi

సిట్‌గెస్‌ (స్పెయిన్‌): ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో రాణించిన భారత అమ్మాయిలు ప్రపంచ మహిళల టీమ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లారు. జార్జియాతో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారత్‌ 2.5–1.5తో విజయం సాధించింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్‌ తొలి మ్యాచ్‌ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. సెమీఫైనల్‌ రెండో మ్యాచ్‌లో తానియా సచ్‌దేవ్, వైశాలి తమ ప్రత్యర్థులను ఓడించి భారత్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించారు.

తానియా 54 ఎత్తుల్లో మేరీ అరాబిద్జెపై... వైశాలి 43 ఎత్తుల్లో గ్రాండ్‌మాస్టర్‌ నినో బత్సియాష్‌విలిపై గెలిచారు. ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక 43 ఎత్తుల్లో గ్రాండ్‌మాస్టర్‌ నానా జాగ్‌నిద్జెతో గేమ్‌ను ‘డ్రా’గా ముగించింది. మేరీఆన్‌ గోమ్స్‌ 62 ఎత్తుల్లో లెలా జవాకిషివిలి చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే ఫైనల్లో రష్యాతో భారత్‌ తలపడుతుంది.

అతాను దాస్‌ విఫలం
యాంక్టన్‌ (అమెరికా): ఆర్చరీ సీజన్‌ ముగింపు టోర్నమెంట్‌ ప్రపంచకప్‌ ఫైనల్స్‌ నుంచి భారత క్రీడాకారులు రిక్తహస్తాలతో తిరిగి వస్తున్నారు. పురుషుల రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్‌ అతాను దాస్‌ కాంస్య పతక పోరులో ఓడిపోయాడు. టోక్యో ఒలింపిక్స్‌ చాంపియన్‌ మెట్‌ గాజోజ్‌ (టర్కీ)తో జరిగిన మ్యాచ్‌లో అతాను దాస్‌ 0–6 (27–29, 26– 27, 28–30)తో పరాజయం పాలయ్యాడు.

చదవండి: Venkatesh Iyer: అయ్యారే అయ్యర్‌.. కేకేఆర్‌ తరపున రెండో బ్యాటర్‌గా

మరిన్ని వార్తలు