15 ఏళ్ల తర్వాత... ఆస్ట్రేలియాతో టెస్ట్‌ మ్యాచ్‌...

19 May, 2021 01:52 IST|Sakshi

ఆస్ట్రేలియాతో టెస్టు ఆడనున్న భారత మహిళల జట్టు 

ముంబై: ఏడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు మ్యాచ్‌ ఆడనున్న భారత మహిళల క్రికెట్‌ జట్టు 2021లో మరో టెస్టు ఆడటం ఖాయమైంది. 2014లో చివరిసారిగా టెస్టు ఆడిన మన జట్టు వచ్చే నెలలో ఇంగ్లండ్‌తో బ్రిస్టల్‌లో టెస్టు మ్యాచ్‌లో తలపడనుంది. దీనికి తోడు ఈ ఏడాది సెప్టెంబరులో ఆస్ట్రేలియా పర్యటించనున్న టీమ్‌కు అక్కడ కూడా ఏకైక టెస్టు మ్యాచ్‌ బరిలోకి దిగనుంది. ఒకే ఏడాది రెండు అగ్రశ్రేణి జట్లతో భారత్‌ టెస్టులు ఆడనుండటం విశేషం.

ఇరు బోర్డులు దీనిపై ఇంకా అధికారిక ప్రకటన చేయకున్నా... ఆసీస్‌ పేస్‌ బౌలర్‌ మేగన్‌ షూట్‌ ఒక ఇంటర్వూ్యలో ఈ విషయాన్ని వెల్లడించింది. 1977, 1984, 1990–91, 2006లలో కలిపి భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య మొత్తం 9 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఆసీస్‌ 4 గెలవగా, మరో 5 ‘డ్రా’గా ముగిశాయి. భారత్‌ ఒక్కదాంట్లోనూ విజయం సాధించలేదు. 2006లో అడిలైడ్‌లో జరిగిన మ్యాచ్‌ తర్వాత ఇరు జట్ల తలపడనుండటం ఇదే మొదటిసారి.
 

మరిన్ని వార్తలు