శభాష్‌ ఇనియన్‌

4 Sep, 2020 04:03 IST|Sakshi

ప్రపంచ ఓపెన్‌ చెస్‌ చాంపియన్‌ను గెలిచిన తొలి భారతీయ జీఎంగా రికార్డు 

చెన్నై:  భారత గ్రాండ్‌ మాస్టర్‌ (జీఎం) పి.ఇనియన్‌ చరిత్ర సృష్టించాడు. ప్రపంచ ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్‌ చాంపియన్‌గా నిలిచి ఔరా అనిపించాడు. గత నెల 7 నుంచి 9 మధ్య క్లాసికల్‌ టైమ్‌ కంట్రోల్‌ పద్ధతిలో ఈ టోర్నీ జరిగినా... ఫెయిర్‌ ప్లే నిబంధనలను పరీశిలించిన అనంతరం నిర్వాహకులు గురువారం విజేతను ప్రకటించారు. ఈ టోర్నీలో విజేతగా నిలవడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత జీఎంగా ఇనియన్‌ ఖ్యాతికెక్కాడు. కరోనా వల్ల ఆన్‌లైన్‌లో 9 రౌండ్ల పాటు జరిగిన ఈ టోర్నీలో ఆరు విజయాలు, మూడు ‘డ్రా’లు నమోదు చేసిన ఇనియన్‌... 7.5 పాయింట్లతో రష్యా జీఎం స్జుగిరో సనన్‌తో పాటు సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు.

అయితే మెరుగైన ‘టై బ్రేక్‌’ ఉండటంతో ఇనియన్‌కు టైటిల్‌ సొంతమైంది. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల ఇనియన్‌ తన కంటే మెరుగైన పలువురు జీఎంలను ఓడించడం విశేషం. వారిలో బహదూర్‌ జొబావ (జార్జియా), స్యామ్‌ సెవియన్‌ (అమెరికా), సెర్గె ఎరెన్‌బర్గ్‌ (అమెరికా), నైజైక్‌ ఇలియా (ఉక్రెయిన్‌) ఉన్నారు. ఇటీవలె ప్రపంచ రెండో ర్యాంకర్‌ ఫాబియానోపై బ్లిట్జ్‌ ఈవెంట్‌లో గెలుపొంది ఇనియన్‌ అందరి దృష్టిని ఆకర్షించడం విశేషం. మొత్తం ఈ టోర్నీలో 16 దేశాలకు చెందిన 120 మంది చెస్‌ ప్లేయర్లు పాల్గొనగా... అందులో 30 మంది జీఎంలు ఉన్నారు.

మరిన్ని వార్తలు