ఐపీఎల్‌: స్టోక్స్‌ అరుదైన ఘనత

26 Oct, 2020 13:07 IST|Sakshi
బెన్ స్టోక్స్‌

ఛేజింగ్‌లో స్టోక్స్‌ రెండుసార్లు అజేయ సెంచరీలు

శతకాలు బాదిన రెండుసార్లూ విజయకేతనం

అబుదాబి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో రాజస్తాన్‌ రాయల్స్ బ్యాట్సమన్‌ బెన్‌ స్టోక్స్‌ అరుదైన ఘనత సాధించాడు. ముంబై ఇండియన్స్‌తో ఆదివారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో అజేయ సెంచరీ (107‌)తో రాజస్థాన్‌ను గెలిపించాడు. సరిగ్గా ఇలాంటి ఫీట్‌నే 2017 ఐపీఎల్‌ సీజన్‌లోనూ నమోదు చేశాడు. గుజరాత్‌ లయన్స్‌ (జీఎల్‌)తో జరిగిన అప్పటి మ్యాచ్‌లో  రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌(ఆర్‌పీఎస్‌) తరపున ఛేజింగ్‌కు దిగిన అజేయ శతకం(103)తో జట్టుకు విజయాన్ని అందించాడు. ఛేజింగ్‌లో స్టోక్స్‌ రెండుసార్లు సెంచరీలు కొట్టగా రెండుసార్లూ ఆయా జట్లు గెలిచాయి. తాజాగా రాజస్తాన్‌ రాయల్స్  తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా తన పేరిట లిఖించుకున్నాడు. (‘సంజూ గ్రేట్‌.. పంత్‌ నువ్వు హల్వా, పూరీ తిను’)

ముంబైతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన స్టోక్స్‌ చివరి వరకు క్రీజ్‌లో ఉండి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సంజూ శాంసన్‌(54) సహకారంతో రాజస్తాన్‌ రాయల్స్‌కు సునాయాస విజయాన్ని అందించాడు. బెన్‌ స్టోక్స్‌ 60 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 107 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. స్టోక్స్‌, శాంసన్ సరైన సమయంలో అద్భుతంగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారని మ్యాచ్‌ ముగిసిన తర్వాత రాయల్స్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ వ్యాఖ్యానించాడు. స్టోక్స్‌ను మాజీ క్రికెటర్లు శ్రీకాంత్‌ కృష్ణమాచారి, సచిన్‌ టెండూల్కర్‌, హర్భజన్‌ సింగ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, యువరాజ్‌ సింగ్‌ పొగడ్తలతో ముంచెత్తారు. ఐపీఎల్‌లో తాను చూసిన వాటిలో ఇదే అత్యుత్తమ సెంచరీ అని శ్రీకాంత్‌ కితాబిచ్చాడు.

చదవండి: రప్ఫాడించిన రాజస్తాన్‌ 

మరిన్ని వార్తలు