రేపే ఐపీఎల్‌ ఫైనల్‌.. బుమ్రా, రబడకు కూడా!

9 Nov, 2020 11:42 IST|Sakshi

అబుదాబి: ఐపీఎల్‌ 13 వ సీజన్‌ చివరి దశకు చేరుకుంది. ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ దుబాయ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో మంగళవారం జరుగనుంది. అయితే, ఐపీఎల్‌ విజేత ఎవరనే ఉత్కంఠ ఒకవైపు కొనసాగుతుండగా.. పర్పుల్‌, ఆరెంజ్‌ క్యాప్‌లను గెలుచుకునే ఆటగాళ్లెవరు? అనే ఆసక్తి పెరిగిపోయింది. బ్యాటింగ్‌ విభాగంలో ప్రస్తుతం కింగ్స్‌ పంజాబ్‌ ఆటగాడు కేల్‌ రాహుల్‌ 670 పరుగులతో టాప్‌లో ఉండగా.. ఢిల్లీ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ 603 పరగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ మూడో స్థానంలో ఉన్నాడు. రాహుల్‌ కన్నా 67 పరుగుల వెనకబడి ఉన్న ధావన్‌కు ఆరెంజ్‌ క్యాప్‌ చేపట్టే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఢిల్లీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాఫ్రికా ఆటగాడు కాగిసో రబడ 29 వికెట్లతో బౌలింగ​ విభాగంలో టాప్‌లో ఉన్నాడు. 27 వికెట్లతో ముంబై బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా తర్వాతి స్థానంలో ఉన్నాడు. 22 వికెట్లతో ముంబై మరో బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ ఉన్నాడు. ఇరు జట్లలో కీలకమైన బుమ్రా, రబడ ఇద్దరిలో ఎవరు రేపు జరిగే ఫైనల్లో సత్తా చాటి పర్పుల్‌ క్యాప్‌ను దాంతోపాటు జట్టుకు విజయాన్ని కట్టబెడతారో చూడాలి. ఆదివారం ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన క్వాలిఫైయర్‌-2 మ్యాచ్‌లో ఢిల్లీ 17 పరుగులతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ జట్టులో ధావన్‌ (50 బంతుల్లో 78 పరుగులు, 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా.. అనంతరం రబాడా నాలుగు వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
(చదవండి: బ్రియన్‌ లారా మెచ్చిన యంగ్‌ క్రికెటర్‌ అతనే!)

మరిన్ని వార్తలు