ముంబైతో మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ రికార్డ్‌

19 Oct, 2020 13:34 IST|Sakshi

దుబాయ్‌: ఐపీఎల్‌లో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులకు మంచి ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఆదివారం దుబాయ్‌ వేదికగా జరిగిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపించిన మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబైపై పంజాబ్‌ జట్టు విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో కేఎల్‌ రాహుల్‌ నేతృత్వంలోని పంజాబ్‌ జట్టు ఆరో స్థానానికి చేరుకుంది.

అయితే ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ జట్టు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ 51 బంతుల్లో 77 పరుగులు చేయడంతో ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు (525) సాధించిన బ్యాట్స్‌మెన్‌గా అగ్రస్థానానికి చేరుకున్నాడు. అంతేకాకుండా ఐపీఎల్‌ చరిత్రలోనే ముంబై జట్టుపై అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మన్‌గానూ గుర్తింపు పొందాడు. నాలుగుసార్లు ఐపీఎల్‌ విజేతగా నిలిచిన ముంబైపై ఇప్పటిదాకా రాహుల్‌ 580 పరుగులు చేశాడు.   
(‘6 పరుగులు సేవ్‌ చేయడం మామూలు కాదు’)

ఇదే మ్యాచ్‌ ద్వారా రాహుల్‌ మరో అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో వరుసగా మూడు సీజన్‌లలోనూ 500 పరుగులు పూర్తిచేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా అరుదైన రికార్డు సాధించాడు. తన టీమ్‌ సహచరుడైన క్రిస్‌ గేల్‌ కూడా వరుసగా మూడు సీజన్లలో 500పై చిలుకు పరుగులు సాధించాడు. ఇక భారత క్రికెటర్లలో ఆర్‌సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ ఇప్పటిదాకా ఐదు సీజన్లలో 500కు పైగా పరుగులు సాధించాడు. మరో బ్యాట్స్‌మన్‌ సురేష్ రైనా కూడా మూడు సీజన్లలో 500కు పైగా పరుగులు సాధించాడు.

మరిన్ని వార్తలు