ఐపీఎల్ 2020‌: యూఏఈకి బీసీసీఐ బంపర్‌ బొనాంజ!

15 Nov, 2020 19:37 IST|Sakshi

దుబాయ్‌: కరోనా అడ్డంకులను దాటుకుని ఐపీఎల్‌ 13వ సీజన్‌ సక్సెస్‌ అయిందంటే కారణం వేదిక యూఏఈ కావడమే! రెండున్నర నెలలపాటు క్రికెట్‌ అభిమానులను అలరించిన ఐపీఎల్‌ 2020 నిర్వహణకు సంబంధించి యూఏఈకి బీసీసీఐ భారీ మొత్తంలోనే ముట్టజెప్పినట్టు జాతీయ మీడియా తెలిపింది. దాదాపు రూ.100 కోట్ల రూపాయలు యూఏఈకి అందినట్టు సమాచారం. కాగా, ఏప్రిల్‌-మే నెలల్లో భారత్‌లో నిర్వహించాల్సిన ఐపీఎల్‌ 13 వ సీజన్‌ కరోనా విజృంభణతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. అనంతరం జూన్‌-జులై నెలల్లో టోర్నీ నిర్వహణకు సన్నాహాలు చేసినా సాధ్యం కాలేదు. దాంతో ఈ ఏడాది ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేద్దామని భావించారు. 
(చదవండి: సీఎస్‌కే కెప్టెన్‌గా అతడికే అవకాశం!)

అయితే, టోర్నీ నిర్వహణకు యూఏఈ అనుకూలమని భావించిన బీసీసీఐ అధికారులు.. అక్కడి అధికారులతో సంప్రదింపులు జరిపారు. 2014 ఐపీఎల్‌కు వేదికైన యూఏఈ.. ఐపీఎల్‌ 2020కి ఓకే చెప్పడంతో మార్గం సుగమమైంది. బీసీసీఐ, ఐపీఎల్‌ సిబ్బంది, ఆటగాళ్లు, యూఏఈ అధికారుల సహకారంతో సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు ఐపీఎల్‌ తాజా సీజన్‌ దిగ్విజయంగా కొనసాగింది. ఇదిలాఉండగా.. వచ్చే ఏడాది ప్రారంభంలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌ కూడా యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.
(చదవండి: ‘కడక్‌నాథ్’‌ కోళ్ల బిజినెస్‌లోకి ధోని ఎంట్రీ!)

మరిన్ని వార్తలు