వచ్చీ రాగానే.. 'క్లీన్‌ బౌల్ట్'‌

13 Sep, 2020 11:57 IST|Sakshi

దుబాయ్‌ : న్యూజిలాండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ ఐపీఎల్‌లో ఈ ఏడాది ముంబై ఇండియన్స్‌కి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. లసిత్‌ మలింగ లేని లోటును తాను తీరుస్తానని బౌల్ట్‌ అంటున్నాడు.  ప్రాక్టీస్‌ సెషన్‌లో వికెట్లను విరగొట్టేస్తున్న బౌల్ట్‌.. తాను ఫామ్‌లోనే ఉన్నా అంటూ ప్రత్యర్థి ఆటగాళ్లకు హెచ్చరికలు పంపాడు. ముంబై ప్రధాన కోచ్‌ మహేల జయవర్దనే ఆధ్వర్యంలో బౌల్ట్‌ తన బౌలింగ్‌ ప్రాక్టీస్‌ కొనసాగించాడు.

బౌలింగ్‌ చేస్తున్నంత సేపు పదునైన లైన్‌ అండ్‌ లెంగ్త్ డెలివరీలు, యార్కర్లతో రెచ్చిపోయాడు. ఈ నేపథ్యంలోనే బౌల్ట్‌ సంధించిన ఒక డెలివరీ వేగంగా వెళ్లి మిడిల్‌ స్టంప్‌ వికెట్‌ను గిరాటేయగా.. అది రెండు ముక్కలైంది. తాజాగా బౌల్ట్‌ బౌలింగ్‌కు సంబంధించిన వీడియోనూ ముంబై ఇండియన్స్ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ' ట్రెంట్‌ వచ్చీ రాగానే.. వికెట్‌ క్లీన్‌ బౌల్ట్‌ అయింది ' అంటూ కామెంట్‌ చేసింది. (చదవండి : ముంబైతో కలిసిన వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌)

ఐపీఎల్‌ 13వ సీజన్‌కు వ్యక్తిగత కారణాలతో లసిత్‌ మలింగ దూరమవ్వడంతో జస్‌ప్రీత్‌ బుమ్రాతో కలిసి బౌల్ట్‌ బౌలింగ్‌ పంచుకోనున్నాడు. 2015లో మొదటిసారి ఐపీఎల్‌లో పాల్గొన్న బౌల్ట్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆడాడు. 2017లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రూ. 5 కోట్లకు బౌల్ట్‌ను కొనుగోలు చేసింది. 2018-19లో బౌల్ట్‌ 2.2 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేయగా.. డిసెంబర్‌ 2019లో జరిగిన వేలంలో ముంబై ఇండియన్స్‌ రూ. 3.2 కోట్లకు దక్కించుకుంది. (చదవండి : రోహిత్‌ శర్మ స్టన్నింగ్‌ క్యాచ్‌ చూస్తారా..)

మరిన్ని వార్తలు