IPL 2021 2nd Phase DC VS SRH: నటరాజన్‌కు కరోనా.. అయినా మ్యాచ్‌ యథాతథం

22 Sep, 2021 16:14 IST|Sakshi
Photo Courtesy: IPL

దుబాయ్‌: ఐపీఎల్‌-2021 రెండో దశలో భాగంగా నేడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు ఎస్‌ఆర్‌హెచ్‌ క్యాంప్‌లో కోవిడ్‌ కలకలం రేపింది. స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ న‌ట‌రాజ‌న్‌కు క‌రోనా నిర్ధారణ కావడంతో అత‌నితో స‌న్నిహితంగా మరో ఆటగాడు విజయ్‌ శంకర్‌ సహా మరో ఐదుగురిని(టీమ్ మేనేజ‌ర్ విజ‌య్‌కుమార్‌, ఫిజియో శ్యామ్ సుంద‌ర్‌, డాక్ట‌ర్ అంజ‌నా వ‌న్న‌న్‌, లాజిస్టిక్స్ మేనేజ‌ర్ తుషార్ ఖేడ్క‌ర్‌, నెట్ బౌల‌ర్ పెరియ‌సామి) ఐసోలేష‌న్‌కు తరలించారు.

అయితే ఎస్‌ఆర్‌హెచ్‌ క్యాంప్‌లోని మిగ‌తా ఆటగాళ్లందరికీ నెగ‌టివ్ రావ‌డంతో నేటి మ్యాచ్ షెడ్యూల్ ప్ర‌కార‌మే యథాతథంగా కొనసాగుతుందని బీసీసీఐ స్ప‌ష్టం చేయడం విశేషం. మహమ్మారి బారిన పడిన నటరాజన్‌కు ఎలాంటి ల‌క్ష‌ణాలూ లేవని, అతను ప్రస్తుతం జట్టు స‌భ్యుల‌కు దూరంగా మరో చోట ఐసోలేష‌న్‌లో ఉంటున్నాడని పేర్కొంది. కాగా, ఎస్‌ఆర్‌హెచ్‌ బృందం మొత్తానికి ఇవాళ ఉద‌యం 5 గంట‌ల‌కు ఆర్టీ-పీసీఆర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్లు తెలుస్తుంది.
చదవండి: ఐపీఎల్‌లో మళ్లీ కరోనా కలకలం.. నటరాజన్‌కు పాజిటివ్‌!
 

మరిన్ని వార్తలు