IPL 2021: అఫ్గాన్‌లో ఐపీఎల్‌ ప్రసారాలపై నిషేధం.. మహిళలే కారణమట..!

21 Sep, 2021 17:14 IST|Sakshi

Taliban Bans IPL Broadcast: అఫ్గాన్‌లో తాలిబన్ల వికృత చేష్టలు రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. దీంతో సాధారణ జనజీవనం దుర్భరంగా మారింది. రెండోసారి అధికారం చేజిక్కించుకున్నాక తాము మారిపోయామంటూ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన తాలిబన్‌ ముష్కరులు గతానికి మించి క్రూరంగా తయారయ్యారు. మహిళలకు సంబంధించి రోజుకో ఫత్వా జారీ చేస్తూ.. ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నారు. క్రీడలకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు ఉండవంటూనే మహిళల పేర్లు చెప్పి తమదైన మార్కు రాక్షస పాలన అమలు చేస్తున్నారు. తాజాగా మహిళల అశ్లీలతను సాకుగా చూపి ప్రపంచ క్రికెట్‌ పండుగ అయిన ఐపీఎల్‌(ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌)పై నిషేధం విధించారు.

స్టేడియాల్లో మహిళా ప్రేక్షకులు ఉంటున్నారని, అక్కడ మహిళలు డ్యాన్స్‌ చేస్తున్నారని, ఇది తమ ఆచారాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. అందుచేతనే ఇస్లామిక్‌ ఎమిరేట్స్‌ ఆఫ్ తాలిబన్‌(ఆఫ్గానిస్తాన్‌)లో ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేస్తున్నామని ప్రకటించారు. ఈ మేరకు అఫ్గాన్‌లో ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ను గట్టిగా హెచ్చరించారు. కాగా, అఫ్గానిస్తాన్‌ స్టార్‌ ఆటగాళ్లు రషీద్‌ఖాన్‌, నబీ సహా పలువురు అఫ్గాన్‌ క్రికెటర్లు ఐపీఎల్‌లో ఆడుతున్నారు. తాలిబన్ల తాజా నిర్ణయం పట్ల వీరు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తాలిబన్ల పాలనలో అనేక వినోద కార్యక్రమాలపై ఆంక్షలు అమల్లో ఉండగా, తాజాగా ఈ జాబితాలో ఐపీఎల్‌ కూడా చేరింది. 
చదవండి: IPL 2021 2nd Phase: అరంగేట్రంలోనే అదరగొట్టిన ఆటగాళ్లు వీరే
 

మరిన్ని వార్తలు