అది ఇంకా బాధించేది: విరాట్‌ కోహ్లి

1 May, 2021 07:59 IST|Sakshi

అహ్మదాబాద్‌: పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమికి తాము తొలుత అనుకున్న దానికంటే ఎక్కువ పరుగులు ఇవ్వడమే కారణమని రాయల్‌ చాలెంజర్స్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పేర్కొన్నాడు. వారిని 160 పరుగులలోపే కట్టడి చేస్తామనుకుంటే అదనంగా మరో 20 పరుగుల్ని ఇచ్చామన్నాడు. పంజాబ్‌కు ఆరంభం బాగున్నా, ఆ తర్వాత వరుస వికెట్లు సాధించి ఒత్తిడిలోకి నెట్టామన్నాడు.​కాగా, చివర్లో మాత్రం పంజాబ్‌ ధాటికి బ్యాటింగ్‌ చేసి పరుగులు సాధించిందన్నాడు.

మ్యాచ్‌ తర్వాత అవార్డుల కార్యక్రమంలో మాట్లాడిన కోహ్లి.. ‘ పంజాబ్‌ బ్యాటర్స్‌ బాగా ఆడారు. మా ప్లాన్‌లు వర్కౌట్‌ కాలేదు. ఎక్కువ చెడ్డ బంతుల్ని వేయడం అవి బౌండరీలు కావడంతో పంజాబ్‌ మంచి స్కోరు చేసింది. ఈ వికెట్‌పై లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బాల్స్‌ను హిట్‌ చేయడం కష్టం. మేము భాగస్వామ్యాలు సాధించడం కోసం చూశాం. 

అలాగే స్టైక్‌రేట్‌ 110 కంటే ఎక్కువ ఉండాలనే కోరుకున్నాం. మేము బ్యాటింగ్‌ యూనిట్‌లో విఫలమయ్యాం. మేము ఎక్కడైతే మెరుగుపడాలో దానిపై దృష్టి పెడతాం. పాటిదార్‌ను ఫస్ట్‌డౌన్‌లో తీసుకురావాలనేది మేమంతా కలిసి నిర్ణయం తీసుకున్నాం. పాటిదార్‌ నాణ్యమైన క్రికెటర్‌. మేము 34 పరుగులతో ఓటమి చెందాం. ఓ దశలో 60 నుంచి 65 పరుగుల తేడాతో పరాజయం చెందుతామని అనుకున్నాం. అలా అయితే అది ఇంంకా బాధించేది. హర్షల్‌-జెమీసన్‌లు బ్యాట్‌ ఝుళిపించడంతో మా ఓటమి మార్జిన్‌ తగ్గింది’ అని తెలిపాడు. 

ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌  34 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసి ఓటమిని చవిచూసింది. ఆర్‌సీబీ బ్యాటింగ్‌లో కోహ్లి 35, పాటిదార్‌ 31,  హర్షల్‌ పటేల్‌ 27 పరుగులు చేశారు.  పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ( 91, 57 బంతులు; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించడంతో పంజాబ్‌ గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది. 

ఇక్కడ చదవండి: మీరు మారండి.. లేకపోతే మిమ్మల్నే మారుస్తాం: మెకల్లమ్‌
స్వదేశానికి వెళ్లే మార్గాలను అన్వేషిస్తున్నాం: మ్యాక్సీ

మరిన్ని వార్తలు