ఒత్తిడిలో ఎలా ఆడాలో పాండేకు తెలియడం లేదు: నెహ్రా

15 Apr, 2021 16:04 IST|Sakshi
Photo Courtesy: BCCI

చెన్నై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. బుధవారం ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 150 పరుగుల సాధారణ లక్ష్యాన్ని చేధించే క్రమంలో 27 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు కోల్పోయి పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమికి మనీష్‌ పాండే బ్యాటింగ్‌ ఒక కారణమని టీమిండియా మాజీ ఆటగాడు ఆశిష్‌ నెహ్రా పేర్కొన్నాడు.

''అతను టీమిండియా జట్టులోకి రావడం.. పోవడం వంటివి జరగడానికి కారణం అతని బ్యాటింగ్‌లో అనుకూలత, స్థిరత్వం లేకపోవడమే ప్రధాన కారణం. అందుకే అతనితో పాటు జట్టులోకి వచ్చిన హార్థిక్‌ సహా ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌లు తమ ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంటే.. పాండే మాత్రం స్థిరత్వం లేని బ్యాటింగ్‌తో టీమిండియాలో రెగ్యులర్‌ సభ్యుడు కాలేకపోయాడు. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎలా ఆడాలో పాండేకు ఇప్పటికి తెలియడం లేదు.

అందుకు ఉదాహరణ.. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో వార్నర్‌ ఉన్నంతసేపు అతనితో మంచి భాగస్వామ్యం నమోదు చేసిన పాండే.. అతను అవుట్‌ కాగానే అదే టెంపోను చూపించలేకపోయాడు. వార్నర్‌, బెయిర్‌ స్టోలు అవుటైనప్పటికి ఎస్‌ఆర్‌హెచ్‌ తాము సాధించాల్సిన పరుగులు తక్కువే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 39 బంతుల్లో 38 పరుగులు చేసిన పాండే చివరి ఆరు ఓవర్లలో ఒక్క బౌండరీ కొట్టలేకపోయాడు. అంతేగాక బాధ్యతాయుతంగా ఆడాల్సిన చోట అనవసర షాట్‌ ఆడి వికెట్‌ సమర్పించుకొని మ్యాచ్‌ ఓటమికి పరోక్షంగా కారణమయ్యాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే నిరూపితమైంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఎస్‌ఆర్‌హెచ్‌ తన తర్వాతి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఎదుర్కోనుంది.
చదవండి: బాధిస్తోంది.. మాకు కూడా అదే జరిగింది: వార్నర్‌

ఇది వార్నర్‌ తప్పిదం కాదా?

>
మరిన్ని వార్తలు