'రోహిత్‌ నా ఫెవరెట్‌ ప్లేయర్‌.. అందుకే ఆ పని చేశా'

21 Apr, 2021 15:54 IST|Sakshi
Courtesy : IPL Twitter

చెన్నై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఆవేశ్‌ ఖాన్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ తరపున నాలుగు మ్యాచ్‌లాడిన అతను ఎనిమిది వికెట్లు తీసి లీడింగ్‌ వికెట్‌టేకర్‌ జాబితాలో ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆవేశ్‌ ఖాన్‌ 2 ఓవర్లు వేసి 15 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ విషయం పక్కనపెడితే.. ఆవేశ్‌ ఖాన్‌కు రోహిత్‌ శర్మ అంటే విపరీతమైన అభిమానం. తనతో కలిసి ఆడేందుకు అవకాశం రాకపోయినా.. ప్రత్యర్థి జట్టు తరపున అతనికి బౌలింగ్‌ చేయడం ఆనందం కలిగించిందని  మ్యాచ్‌ తర్వాత చెప్పుకొచ్చాడు. అందుకే మ్యాచ్‌ ముగిశాక రోహిత్‌ను కలిసిన ఆవేశ్‌ ఖాన్‌ తన జెర్సీని తీసి రోహిత్‌కు ఇచ్చి ఆటోగ్రాఫ్‌ కావాలని అడిగాడు. అత‌ని అభిమానానికి ఫిదా అయిన రోహిత్ ముసిముసిగా న‌వ్వుతూ జెర్సీపై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు.  దీనికి సంబంధించిన ఫోటోలను ఢిల్లీ క్యాపిటల్స్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది.  

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (30 బంతుల్లో 44; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. ఢిల్లీ స్పిన్నర్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అమిత్‌ మిశ్రా (4/24) తిప్పేశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 19.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసి గెలిచింది. శిఖర్‌ ధావన్‌ (42 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్‌), స్మిత్‌ (29 బంతుల్లో 33; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు.
చదవండి: మా ఓటమికి అదే కారణం: రోహిత్‌

ఐపీఎల్‌ 2021: ఈసారి మాత్రం ఢిల్లీదే పైచేయి‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

మరిన్ని వార్తలు