'మేం సీఎస్‌కేకు ఆడలేం'.. కారణం అదేనట

4 Apr, 2021 11:20 IST|Sakshi
బిల్లీ స్టాన్‌లేక్‌

ముంబై: ఐపీఎల్‌ 2021 సీజన్‌ ప్రారంభానికి ముందే సీఎస్‌కే జట్టుకు హాజిల్‌వుడ్‌ షాక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. బయోబబుల్‌లో ఉండడం ఇష్టం లేక.. ఫ్యామిలీతో సమయం గడపాలనే తాను ఐపీఎల్‌ ఆడడం లేదంటూ హాజిల్‌వుడ్‌ స్పష్టం చేశాడు. దీంతో హాజిల్‌వుడ్‌ స్థానంలో ఎవరిని తీసుకోవాలదానిపై సీఎస్‌కే తర్జనభర్జన పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆసీస్‌ పేసర్‌ బిల్లీ స్టాన్‌లేక్‌తో పాటు ఇంగ్లండ్‌ బౌలర్‌ రీస్‌ టోప్లీ పేర్లను సీఎస్‌కే పరిగణలోకి తీసుకొని వారి వద్ద విషయాన్ని ప్రస్తావించింది. అయితే అనూహ్యంగా స్టాన్‌లేక్‌, టోప్లీలు సీఎస్‌కే ఆఫర్‌ను తిరస్కరించినట్లు సమాచారం.  

తాము సీఎస్‌కేకు ఆడలేమని.. అసలు ఐపీఎల్‌లో కూడా పాల్గొనే అవకాశం లేదంటూ బాంబు పేల్చారు. ఇండియాలో కరోనా కేసులు పెరిగిపోవడం.. ఒకవేళ ఐపీఎల్‌లో ఆడేందుకు వచ్చినా బయోబబుల్‌ ఉంటూ మ్యాచ్‌లు ఆడాల్సి వస్తుంది. అందుకే సీఎస్‌కే ఇచ్చిన ఆఫర్‌ను తాము తిరస్కరించినట్లు ఈ ఇద్దరు పేర్కొన్నారు. కాగా సీఎస్‌కే గతేడాది సీజన్‌లో దారుణ ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లోనే అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న సీఎస్‌కే గతేడాది మాత్రం చెత్త ప్రదర్శనను నమోదు చేసింది. ధోని సారథ్యంలోని చెన్నై జట్టు 14 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు.. ఎనిమిది ఓటములతో ఏడో స్థానంలో నిలిచింది.

అయితే ఈసారి ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభం కాకముందే కరోనా కలవరం పుట్టిస్తోంది. ఆటగాళ్లంతా వరుసగా కరోనా బారీన పడుతున్నారు. కేకేఆర్‌ నుంచి నితీష్‌ రాణా.. ఢిల్లీ క్యాపిటల్స్‌ నుంచి అక్షర్‌ పటేల్‌లు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కాగా.. తాజగా ఆర్‌సీబీ ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌కు కూడా కరోనా సోకింది. అంతేగాక శనివారం ముంబైలోని వాంఖడే స్టేడియం సిబ్బందిలో 8 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో ముంబైలో మ్యాచ్‌ల నిర్వహణపై బీసీసీఐ పునరాలోచనలో పడింది.
చదవండి: నేను కెప్టెన్‌ అవుతానని అస్సలు ఊహించలేదు: సంజూ

సీఎస్‌కే శిబిరంలో కరోనా కలకలం

మరిన్ని వార్తలు