సీఎస్‌కే వర్సెస్‌ ఆర్‌ఆర్‌ మ్యాచ్‌ కూడా రీషెడ్యూలేనా!

4 May, 2021 11:14 IST|Sakshi
Photo Courtesy: BCCI

ఢిల్లీ:  ఐపీఎల్‌ తొలి అంచె మ్యాచ్‌లు క్రికెటర్ల భయాందోళనల మధ్య పూర్తికాగా, రెండో అంచె ప్రారంభం కాబోయే సమయానికి కరోనా సంక్షోభం భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ)ని కలవరపెడుతోంది. ఐపీఎల్‌ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీసీఐ.. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పింది. బయోబబుల్‌ వాతావరణంలో మ్యాచ్‌లు జరిగితే ఎటువంటి ఇబ్బంది ఉండదని, కేకేఆర్‌ ఆటగాళ్లకు కరోనా సోకడానికి వారు ఏమైనా నిబంధనలు అతిక్రమించి ఉండవచ్చని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు.

కాగా, సీఎస్‌కే శిబిరంలో సైతం కరోనా  కలకలం రేగిందనే వార్తల నేపథ్యంలో బుధవారం(మే5వ తేదీన) ఢిల్లీలో అరుణ్‌జైట్టీ స్టేడియంలో సీఎస్‌కే-రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ కూడా వాయిదా పడే అవకాశాలు కనబడుతున్నాయి. దీనిపై ఇంతవరకూ స్పష్టత లేకపోయినా సీఎస్‌కే బౌలింగ్‌ కోచ్‌ లక్ష్మీపతి బాలాజీ కరోనా బారిన పడటమే కాకుండా మరో ఇద్దరికి ఆ వైరస్‌ సోకిందనే వార్తలు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ కూడా రీషెడ్యూల్‌ చేయక తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి.

ఈ అంశంపై సాయంత్రలోగా స్పష్టత రావొచ్చు. ఇప్పటికే బీసీసీఐ.. ఒకే వేదికలో మిగిలిన ఐపీఎల్‌ సీజన్‌ నిర్వహించడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రెండో అంచె మ్యాచ్‌లు మొత్తం ముంబైలోని మూడు స్టేడియాల్లో జరపాలని చూస్తోంది. దీనికి గ్రీన్‌ సిగ్నల్‌ లభిస్తే మే7వ తేదీ నుంచి ముంబైలోనే మ్యాచ్‌లు జరగుతాయి. అన్ని జట్లు ఒకే చోట ఉండి, వేర్వేరు నగరాలకు వెళ్లకుండా నియంత్రిస్తేనే  కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చనేది బీసీసీఐ ఆలోచన. అలా జరిగితే కోల్‌కతా, బెంంగళూరు వేదికల్లో మ్యాచ్‌లు లేనట్లే.

ఇక్కడ చదవండి: ఒకే వేదికలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు..!

మరిన్ని వార్తలు