క్రికెట్‌ కుంభమేళా: నేటి నుంచి ఐపీఎల్‌–2021

9 Apr, 2021 03:55 IST|Sakshi

నేటి నుంచి ఐపీఎల్‌–2021 

తొలి మ్యాచ్‌లో ముంబైతో బెంగళూరు ఢీ

ఐపీఎల్‌ ఆటకు వేళయింది.  టైటిల్‌ వేటకు రంగం సిద్ధమైంది.  ఈ రెండింటికి ముందే ‘పాజిటివ్‌’ల గోల మొదలైంది.  డగౌట్‌లో మాస్క్‌లతో... మైదానంలో బ్యాట్, ప్యాడ్లతో మెరుపుల లీగ్‌ రెడీ రెడీ అంటోంది. ఓ విధంగా ఇది క్రికెట్‌ కుంభమేళానే! కానీ వైరస్‌ వల్ల ప్రత్యక్షంగా చూడలేకపోయినా... ప్రపంచవ్యాప్తంగా అభిమానులంతా టీవీలకే అతుక్కుపోయే క్రికెట్‌ మేళా ఇది! ఒకప్పుడు ఐపీఎల్‌ అంటే బౌండరీ మీటర్, పర్పుల్‌ క్యాప్, ఆరెంజ్‌ క్యాప్‌లే తారుమారయ్యేవి. కానీ ఇప్పుడు మహమ్మారి కేసులు, క్వారంటైన్, ఐసోలేషన్‌లు లీగ్‌లో భాగమయ్యాయి.  

ఆటగాళ్లు తేల్చుకుంటారు మైదానంలో! మనం మాత్రం చూసుకుందాం టీవీల్లో! ఎందుకంటే కరోనా వైరస్‌ కాచుకుంది. గతానికి భిన్నంగా మనదేశంలో జరిగే ఐపీఎల్‌ పోటీలను మన వెళ్లి చూడలేని పరిస్థితి. గతేడాది యూఏఈలో జరిగినా... అది పరాయిగడ్డ! కానీ మన నగరాల్లో మెరుపులు మెరిపిస్తున్నా... అవి మనకు బుల్లితెరల్లోనే కనిపిస్తాయి. ఈల గోల ఉండదు.  ఆడే ఆటగాళ్లు, తీర్పులిచ్చే అంపైర్లు, ఖాళీగా కుర్చీలు కనిపిస్తాయి. అయితే ఆట బోసిపోదు. మెరుపుల పవర్‌ తగ్గదు. బౌలింగ్‌ పదును తగ్గదు. తొలి పంచ్‌ విసిరేందుకు డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ సై అంటోంది. శుభారంభం చేసేందుకు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు సిద్ధమంటోంది.


మరిన్ని వార్తలు