ఐపీఎల్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఏంటంటే..?

18 Aug, 2021 16:09 IST|Sakshi

న్యూఢిల్లీ: సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్‌) సెకెండ్‌ ఎడిషన్‌ మ్యాచ్‌లు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐపీఎల్‌ అభిమానులకు బీసీసీఐ, ఈసీబీ(ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు) గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఐపీఎల్ సెకెండ్ మ్యాచ్‌ల కోసం మైదానాల్లోకి ప్రేక్షకులను అనుమతించబోతున్నట్లు సూచన ప్రాయంగా వెల్లడించింది. ఇందుకు యూఏఈ ప్రభుత్వం కూడా పచ్చ జెండా ఊపింది. అయితే, ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. 

కాగా, కరోనా కారణంగా అర్ధంతరంగా నిలిచిపోయిన క్యాష్‌ రిచ్‌ లీగ్‌ను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ భావించిన సమయంలో స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతిస్తారా..? లేదా అనే విషయంపై పెద్ద చర్చ నడిచింది. అయితే దానిపై అప్పట్లో బీసీసీఐ కానీ, యూఏఈ ప్రభుత్వం కానీ స్పందించలేదు. దాంతో యూఏఈ క్రికెట్ బోర్డు జనరల్ సెక్రెటరీ ముబాషిర్ ఉస్మాన్‌.. యూఏఈ ప్రభుత్వంతోనూ, ఇటు బీసీసీఐతోనూ మాట్లాడాతమని అప్పట్లో ప్రకటించారు. ఇక తాజాగా ఈ చర్చలు ఫలించడంతో.. 60శాతం ప్రేక్షకులను అనుమతిచ్చేందుకు యూఏఈ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలనుకునే ప్రేక్షకులు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించుకుని ఉండాలని కండీషన్‌ను పెట్టింది.

ఇదిలా ఉంటే, వచ్చే ఏడాది ఐపీఎల్ గురించి కూడా అభిమానులకు బీసీసీఐ ఓ తీపికబురు అందించింది. బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ ఐపీఎల్-2022 గురించి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది టోర్నీ ప్రేక్షకులకు మరింత మజా పంచనుందని పేర్కొన్నారు. అయితే, ఎప్పటిలా 8 జట్లతో కాకుండా.. 10 జట్లతో టోర్నీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అయితే ఏ జట్లు కొత్తగా చేరబోతున్నాయనే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పకుండా సస్పెన్స్‌లో పెట్టారు. 
చదవండి: కామెడీ టైమింగ్‌తో అదరగొట్టిన సూర్యకుమార్‌, పృథ్వీ షా

మరిన్ని వార్తలు