తను ఇంటికి వెళ్లడం ఆశ్చర్యం కలిగించింది: క్రికెటర్‌

26 Apr, 2021 14:24 IST|Sakshi
Courtesy: IPL Twitter

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతేడాది యూఏఈ వేదికగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ నిర్వహించిన బీసీసీఐ ఈసారి మాత్రం భారత్‌లోనే టోర్నీని నిర్వహిస్తోంది. బయో బబుల్‌ నిబంధనల నడుమ ఈ మెగా ఈవెంట్‌ కొనసాగుతోంది. అయితే, గత నాలుగు రోజులుగా భారత్‌లో కరోనా రోజూవారీ కేసులు 3 లక్షలకు పైగా నమోదవుతున్న వేళ కొంతమంది విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పి స్వదేశానికి పయనమవుతున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆండ్రూ టై(రాజస్తాన్‌ రాయల్స్‌), ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆడం జంపా, కేన్‌ రిచర్డ్‌సన్‌ ఇంటిబాటపట్టారు.


                                Courtesy: IPL Twitter

ఈ నేపథ్యంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా సోమవారం కీలక ప్రకటన చేసింది. ఐపీఎల్‌-2021 ఆడుతున్న తమ క్రికెటర్లు, కోచ్‌లు, కామెకంటేటర్లతో టచ్‌లో ఉన్నామని, ఎప్పటికప్పుడు పరిస్థితుల గురించి ఆరా తీస్తున్నట్లు తెలిపింది. భారత్‌లో కరోనా వ్యాప్తి ఉధృతమవుతోందని, ఇలాంటి కష్ట సమయంలో కచ్చితంగా తాము భారతీయులకు మద్దతుగా నిలబడతామని, అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వ సూచనల మేరకు తమ క్రికెటర్లను వెనక్కి పిలిపించే అవకాశాలను పరిశీలిస్తామని స్పష్టం చేసింది. 

ఈ మేరకు.. ‘‘బయో సెక్యూరిటీ ప్రొటోకాల్స్‌ నడుమ ఐపీఎల్‌ ఆడుతున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు, కోచ్‌లు, కామెంటేటర్లతో క్రికెట్‌ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా క్రికెట్‌ అసోసియేషన్‌ కాంటాక్ట్‌లో ఉంటోంది. భారత్‌లోని క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటోంది. భారత్‌కు మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది’’అని ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, పాట్‌ కమిన్స్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ తదితర 14 మంది ఆసీస్‌ క్రికెటర్లు ఐపీఎల్ ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ముగ్గురు ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లిపోగా, మిగతా క్రికెటర్లు కూడా టోర్నీ నుంచి నిష్క్రమిస్తే తీవ్ర ప్రభావం పడటం ఖాయం.

ఇక ఈ విషయంపై స్పందించిన కౌల్టర్‌ నైల్‌ మాట్లాడుతూ... ‘‘ప్రతి ఒక్కరి మనఃస్థితి, అభిప్రాయాలు వేర్వేరుగా ఉంటాయి. ఆండ్రూ ఇంటికి వెళ్లడం నాకు ఆశ్చర్యం కలిగించింది. జంప్స్‌, రిచో కూడా వెళ్లిపోయారు. నేను జంప్స్‌తో మాట్లాడాను. స్వదేశానికి వెళ్లడం వెనుక గల కారణాలపై తన వాదన విన్నాను. నాకు మాత్రం బయోబబుల్‌లో ఉండటమే సురక్షితంగా అనిపిస్తోంది’’ అని చెప్పుకొచ్చాడు. ఇక చేతి వేలి గాయం కారణంగా రాజస్తాన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇంగ్లండ్‌ ఆటగాడు బెన్‌స్టోక్స్‌, మరో క్రికెటర్‌ జోఫ్రా ఆర్చర్‌ టోర్నీకి దూరమైన విషయం తెలిసిందే.

చదవండి: బెయిస్టో అప్పుడు టాయిలెట్‌లో ఉంటే తప్ప 

మరిన్ని వార్తలు