వైరల్‌: భజ్జీ కాళ్లు మొక్కిన రైనా.. వెంటనే

22 Apr, 2021 14:43 IST|Sakshi
(Photo Source: Twitter)

ముంబై: చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆట ప్రారంభానికి ముందు సీఎస్‌కే క్రికెటర్‌ సురేశ్‌ రైనా, కేకేఆర్‌ బౌలర్‌ హర్భజన్‌ సింగ్‌ పాదాలకు నమస్కరించాడు. ఊహించని ఈ పరిణామానికి కంగుతిన్న భజ్జీ.. వెంటనే రైనాను వారించి, గుండెలకు హత్తుకుని ఆప్యాయత చాటుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ ట్విటర్‌ యూజర్‌ షేర్‌ చేయగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

ఈ క్రమంలో.. ‘‘ అందుకే కదా మాకు రైనా అంటే ఇష్టం. తన మాజీ సహచర ఆటగాడి పట్ల అతడికి ఉన్న గౌరవమర్యాదలు ఇలా తెలియజేశాడు. ఆటగాళ్ల మధ్య ఇలాంటి అనుబంధం చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తుంది’’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా హర్భజన్‌ సింగ్‌ గత ఐపీఎల్‌ సీజన్‌లో సీఎస్‌కేకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే.. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేకపోయాడు.

ఈ క్రమంలో, మినీ వేలం-2021లో భాగంగా చెన్నై ఫ్రాంఛైజీ అతడిని వదులుకోగా, కేకేఆర్‌ రూ. 2 కోట్లు(కనీస ధర) వెచ్చించి భజ్జీని కొనుగోలు చేసింది. కాగా.. రైనా, హర్భజన్‌ 2011 నాటి వరల్డ్‌ కప్‌ గెలిచిన టీమిండియాలో సభ్యులు అన్న సంగతి తెలిసిందే. ఇక బుధవానం నాటి మ్యాచ్‌ విషయానికొస్తే.. వాంఖడేలో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ధోని సేన, కోల్‌కతాపై 18 పరుగుల తేడాతో గెలుపొందింది. 

చదవండి: కేకేఆర్‌ బాయ్స్‌ మీరు సూపర్‌: షారుక్‌
CSK Vs KKR: కమిన్స్‌ మెరుపులు వృథా

మరిన్ని వార్తలు