Delhi Capitals Spinner Ashwin Bags 250th T20 Wicket: పొట్టి క్రికెట్లో ఢిల్లీ క్యాపిటల్స్ వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్-2021 రెండో దశలో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో అశ్విన్ ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో డేవిడ్ మిల్లర్ వికెట్ తీయడం ద్వారా అశ్విన్.. టీ20 క్రికెట్లో 250 వికెట్ను పడగొట్టాడు. ఫలితంగా ఈ ఘనతను సాధించిన మూడో భారత స్పిన్నర్గా రికార్డు నెలకొల్పాడు. అశ్విన్ ఈ మైలురాయిని 254 టీ20 మ్యాచ్ల్లో చేరుకున్నాడు. అశ్విన్కు ముందు పియుష్ చావ్లా, అమిత్ మిశ్రా ఈ ఘనతను సాధించారు.
ఇక ఐపీఎల్ విషయానికొస్తే.. ఈ క్యాష్ రిచ్ లీగ్లో 161 మ్యాచ్లు ఆడిన యాష్.. 140 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు. ఈ లిస్ట్లో ముంబై బౌలర్ లసిత్ మలింగా 170 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఢిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రా(160), ముంబై స్పిన్నర్ పియుష్ చావ్లా(156), చెన్నై బౌలర్ డ్వేన్ బ్రావో(154), కేకేఆర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్(150) అశ్విన్ కన్నా ముందున్నారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడ్డ రాజస్థాన్ రాయల్స్ 121 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి 33 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చివరి దాకా పోరాడినా సంజూ సామ్సన్(53 బంతుల్లో 70 నాటౌట్; 8 ఫోర్లు, సిక్స్) జట్టును గట్టెక్కించలేకపోయాడు.
చదవండి: రద్దైన టెస్ట్ మ్యాచ్ అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన ఇరు బోర్డులు.. అయితే..?