ఓడిపోయినా సెలబ్రేట్‌ చేసుకున్నారు.. అదేంటో

20 Apr, 2021 18:28 IST|Sakshi

ముంబై: అదేంటి మ్యాచ్‌ ఓడిపోతే  బాధతో ఉంటారు కానీ సెలబ్రేట్‌ చేసుకుంటారా అన్న అనుమానం వస్తుంది కదూ.. వాస్తవానికి ఇక్కడ సెలబ్రేషన్‌ అనే మాట నిజమే.. అయితే అవి బర్త్‌డే వేడుకలు మాత్రమే. గత ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు పంజాబ్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విషయం పక్కనపెడితే.. సోమవారం (ఏప్రిల్‌ 19) పంజాబ్‌ కింగ్స్‌ ఆలరౌండర్‌ దీపక్‌ హుడా పుట్టినరోజు. ఈ సందర్భంగా పంజాబ్‌ కింగ్స్‌ యాజమాన్యం అతని బర్త్‌డే వేడుకలు ఘనంగా నిర్వహించింది. కేఎల్‌ రాహుల్‌ సహా ఇతర ఆటగాళ్లు దీపక్‌ హుడాకు విషెస్‌ తెలిపి అతని చేత కేక్‌ కట్‌ చేయించారు. దీనికి సంబంధించిన వీడియోనూ ట్విటర్‌లో షేర్‌ చేశారు. అయితే వీడియో చూసిన కొంతమంది నెటిజన్లు వినూత్నంగా స్పందించారు. ఓడిపోయినా సెలబ్రేషన్‌ చేసుకుంటున్నారు... అదేంటి ఓడిపోయినంత మాత్రానా బర్త్‌డే వేడుకలు నిర్వహించకూడదా.. అంటూ కామెంట్లు చేశారు.  

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. మొదట పంజాబ్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌ (36 బంతుల్లో 69; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), కేఎల్‌ రాహుల్‌ (51 బంతుల్లో 61; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించారు. ఆఖర్లో దీపక్‌ హుడా (13 బంతుల్లో 22 నాటౌట్‌ 2 సిక్సర్లు), షారుఖ్‌ (5 బంతుల్లో 15; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడారు. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ మరో 10 బంతులు మిగిలుండగానే 18.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసి గెలిచింది. పృథ్వీ షా (17 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి తొలి వికెట్‌కు 59 పరుగులు జోడించిన ధావన్, రెండో వికెట్‌కు స్మిత్‌ (9)తో 48 పరుగులు జతచేశాడు.  సెంచరీకి చేరువైన దశలో రిచర్డ్‌సన్‌ బౌలింగ్‌లో ధావన్‌ అవుటయ్యాడు. అనంతరం స్టొయినిస్‌ (13 బంతుల్లో 27 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), లలిత్‌ యాదవ్‌ (6 బంతుల్లో 12 నాటౌట్‌; 2 ఫోర్లు) వేగంగా ఆడటంతో మరో 10 బంతులు మిగిలుండగానే ఢిల్లీ లక్ష్యాన్ని అధిగమించింది. అయితే పంజాబ్‌ కింగ్స్‌ వరుసగా రెండో ఓటమిని నమోదు చేసి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది.
చదవండి: భార్యలతో అదరగొట్టిన పాండ్యా బ్రదర్స్‌.. వీడియో వైరల్‌

అసలు మీ స్ట్రాటెజీ ఏంటి: అలా ఐతే షమీతో ఓపెనింగ్‌ చేయించండి!

మరిన్ని వార్తలు