ధోని  మెడపై వేలాడుతున్న నిషేధపు కత్తి

16 Apr, 2021 17:00 IST|Sakshi

ముంబై: చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనిపై నిషేధపు కత్తి వేలాడుతూ ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో స్లో ఓవ‌ర్ రేట్ కార‌ణంగా అతనికి 12 ల‌క్ష‌ల జ‌రిమానా విధించిన సంగ‌తి తెలిసిందే. శుక్రవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో మళ్లీ అదే సీన్‌(స్లో ఓవర్‌ రేట్‌) రిపీట్‌ అయితే.. ఈసారి ధోనిపై తాత్కాలిక నిషేధం విధించే ప్రమాదం ఉంది.  బీసీసీఐ రూపొందించిన కొత్త రూల్స్ ప్ర‌కారం నేటి మ్యాచ్‌లో ధోని సేన.. తమ 20 ఓవర్ల కోటాను 90 నిమిషాల వ్యవధిలో పూర్తి చేయని పక్షంలో ధోనిపై క‌నీసం రెండు నుంచి నాలుగు మ్యాచ్‌ల నిషేధం విధించే అవకాశం ఉంది.

సవరించిన రూల్స్‌ గురించి లీగ్‌ ఆరంభానికి ముందు నుంచే అన్ని ఫ్రాంఛైజీల‌ను హెచ్చరిస్తున్నప్పటికీ.. కొన్ని ఫ్రాంఛైజీలు తేలికగా తీసుకుంటున్న నేపథ్యంలో బీసీసీఐ కొరడా ఝుళిపించాలని నిర్ణయించుకుంది. అయితే స్లో ఓవర్‌ రేట్‌ నమోదు చేసిన జట్టు కెప్టెన్‌పై ఎన్ని మ్యాచ్‌ల నిషేధం విధించాలన్న నిర్ణ‌యాన్ని మ్యాచ్ రిఫరీ విచక్షణకే వదిలి పెట్టింది. అసలే ఢిల్లీతో మ్యాచ్‌ను చేజార్చుకున్న బాధలో ఉన్న ధోని సేనకు.. ఈ అంశం మరింత కలవరపెడుతుంది. కాగా, ముంబై వేదికగా నేడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు, పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనుంది. పంజాబ్‌ తమ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌పై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి ఉరకలేస్తుండగా.. ధోని సేన మాత్రం ఢిల్లీతో మ్యాచ్‌ను చేజార్చుకుని నిరాశలో కూరుకుపోయింది.
చదవండి: సన్‌రైజర్స్‌ యాజమాన్యంపై సానియా మీర్జా తండ్రి ఫైర్..

>
మరిన్ని వార్తలు