గతేడాది ఒక్క సిక్స్‌ కొట్టలేదు.. ఈసారి రిపీట్‌ అవ్వొద్దనే

10 Apr, 2021 15:52 IST|Sakshi
ఫోటో కర్టసీ: ఐపీఎల్‌ వెబ్‌సైట్‌

చెన్నై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ 39 పరుగులే చేశాడు. కానీ ఆ పరుగులే బెంగళూరు విజయానికి బాటలు పరిచాయి. మ్యాక్స్‌వెల్‌ ఇన్నింగ్స్‌లో రెండు సిక్స్‌లు కూడా ఉన్నాయి.అయితే ఇదే మ్యాక్స్‌వెల్‌ గతేడాది సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరపున దారుణ ప్రదర్శన కనబరిచాడు. పంజాబ్‌ తరపున 13 మ్యాచ్‌లాడిన మ్యాక్సీ కేవలం 108 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. పైగా గతేడాది మ్యాక్సీ ఇన్నింగ్స్‌ల్లో ఒక్క సిక్స్‌ కూడా లేకపోవడం విశేషం. తాజాగా తన ఇన్నింగ్స్‌పై మ్యాక్సీ హర్షల్‌ పటేల్‌తో జరిగిన చిట్‌చాట్‌లో స్పందించాడు.

'ముంబైతో జరిగిన మ్యాచ్‌లో నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా. గతేడాది ఐపీఎల్‌ ఒక్క సిక్స్‌ కూడా కొట్టలేకపోయా... ఆ బాధను అ‍ప్పట్లో చాలా రోజులు అనుభవించా. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో నేను బ్యాటింగ్‌ వచ్చేసరికి కోహ్లి ఉన్నాడు. అతనికి ఇదే విషయం చెప్పా. ఇంకో విషయం ఏంటంటే.. నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో మా కెప్టెన్ కోహ్లి ఉండడంతో నా పని మరింత సులువైంది. ఒక మంచి ఇన్నింగ్స్‌తో ఈ సీజన్‌ను ఆరంభించా.. ఇదే ప్రదర్శనను వచ్చే మ్యాచ్‌ల్లోనూ పునరావృతం చేసేందుకు ప్రయత్నిస్తా అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ ఆఖరి బంతికి విజయాన్ని నమోదు చేసింది. ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌లో డివిలియర్స్‌ 48, మ్యాక్స్‌వెల్‌ 39, కోహ్లి 33 పరుగులతో రాణించారు.
చదవండి: మాక్సీ మెరుపులు: గట్టిగా హగ్‌ ఇచ్చేవాళ్లం.. కౌంటర్‌ పడిందిగా!

మరిన్ని వార్తలు