ఐపీఎల్‌కు వస్తున్నా.. కానీ సుయాజ్‌లో చిక్కుకున్నా!

30 Mar, 2021 11:57 IST|Sakshi

వెల్లింగ్టన్‌: ఐపీఎల్‌ 2021 సీజన్‌కు సిద్ధమవుతున్న వేళ విదేశీ ఆటగాళ్లంతా  ఐపీఎల్‌లో ఆడేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ జిమ్మి నీషమ్‌, ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ మధ్య ట్విటర్‌ వేదికగా ఆసక్తికర సంభాషణ జరిగింది. అసలు విషయంలోకి వెళితే.. ఐపీఎల్‌ 2021 సీజన్‌లో నీషమ్‌ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా ట్విటర్‌లో నీషమ్‌ను ఐపీఎల్‌ అభిమాని ఒక ప్రశ్న అడిగాడు‌. ''నీషమ్‌.. ఐపీఎల్‌ త్వరలో ప్రారంభమవుతుంది.. ముంబై జట్టుతో ఎప్పుడు వచ్చి చేరుతున్నావంటూ'' ప్రశ్నించాడు. దీనికి నీషమ్‌.. ''నేను ఐపీఎల్‌కు వస్తున్నా.. కానీ కార్గో షిప్‌ వల్ల ఇప్పుడు సుయాజ్‌ కాలువలో చిక్కుకుపోయా.. త్వరలోనే బయటపడుతా'' అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. నీషమ్‌ ఇచ్చిన సమాధానానికి మ్యాక్స్‌వెల్‌ తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చాడు.

చదవండి: ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌ షెడ్యూల్‌

నీషమ్‌..'' 46, 44, 46 ఈ బరువులు నీ బ్యాగ్‌లో మోస్తూనే ఉన్నావా.. అందుకే చిక్కుకుపోయావు'' అంటూ కామెంట్‌ చేశాడు. మొదట మ్యాక్స్‌వెల్‌ చెప్పింది ఎవరికి అర్థం కాలేదు.. మ్యాక్సీ అలా పెట్టడం వెనుక ఒక కారణం ఉంది. కివీస్‌, ఆసీస్‌ మధ్య జరిగిన ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా మూడో టీ20లో మ్యాక్సీ విశ్వరూపం ప్రదర్శించాడు. ఆ మ్యాచ్‌లో 70 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల​ నీషమ్‌ను ఉతికారేశాడు. నీషమ్‌ వేసిన ఒకే ఓవర్లో వరుసగా 4,6,4,4,4,6 బాది మొత్తంగా 28 పరుగులు పిండుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ ఘన విజయం సాధించగా.. ఓవరాల్‌గా మాత్రం న్యూజిలాండ్‌ 3-2 తేడాతో సిరీస్‌ దక్కించుకుంది.


అయితే ఈ సిరీస్‌ ముగిసిన తర్వాత జిమ్మి నీషమ్‌, మ్యాక్స్‌వెల్‌లు తమ జెర్సీలను ఒకరికి ఒకరు ఇచ్చుకున్న సంగతి తెలిసిందే. మ్యాక్సీ నీషమ్‌కు అందజేసిన జెర్సీపై 4,6,4,4,4,6 అని రాసి ఉండడం అప్పట్లో​ వైరల్‌గా మారింది.  ఈ ఏడాది మ్యాక్స్‌వెల్‌ ఆర్‌సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది పంజాబ్‌ కింగ్స్‌ తరపున మ్యాక్సీ ఘోరంగా విఫలమయ్యాడు.  13 మ్యాచ్‌లాడిన అతను 108 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరచడంతో పంజాబ్‌ జట్టు అతన్ని రిలీజ్‌ చేసింది. అయితే మ్యాక్స్‌వెల్‌ బిగ్‌బాష్‌ లీగ్‌తో పాటు అంతర్జాతీయ టీ20ల్లో దుమ్మురేపే ప్రదర్శన చేయడంతో అతని క్రేజ్‌ మరింత పెరిగింది. ఫిబ్రవరిలో జరిగిన మినీ వేలంలో మ్యాక్సీని రూ. 14.25 కోట్లకు ఆర్‌సీబీ దక్కించుకోవడం విశేషం. కాగా ఐపీఎల్‌ 2021 సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఏప్రిల్‌ 9న ముంబై ఇండియన్స్‌, ఆర్‌సీబీ మధ్య జరగనుంది.
చదవండి: 
'మ్యాక్స్‌వెల్.. 4,6,4,4,4,6.. నీకే తీసుకో'

మరిన్ని వార్తలు