సామ్సన్‌ చేసింది కరెక్టే  కదా..!

13 Apr, 2021 15:12 IST|Sakshi
ఫోటో కర్టసీ(బీసీసీఐ/ఐపీఎల్‌)

ముంబై: పంజాబ్‌ కింగ్స్‌తో సోమవారం ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ గెలుపు అంచుల వరకూ వచ్చి చతికిలబడింది. గత ఐపీఎల్‌ సీజన్‌లో ఇరుజట్ల మధ్య జరిగి తొలి లీగ్‌ మ్యాచ్‌నే దాదాపు గుర్తు చేసిన ఈ మ్యాచ్‌.. ఈసారి రాజస్తాన్‌కు నిరాశనే మిగిల్చింది. అర్షదీప్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో రాజస్తాన్‌ విజయానికి 13 పరుగులు అవసరం కాగా,  తొలి నాలుగు బంతులకు 8 పరుగులు వచ్చాయి. అందులో నాల్గో బంతిని సామ్సన్‌ సిక్స్‌గా కొట్టడంతో  ఇంకా రెండు బంతుల్లో 5 పరుగులు మాత్రమే అవసరం. కానీ ఐదో బంతికి పరుగు రాలేదు.  డీప్‌ ఎక్స్‌ట్రా కవర్‌లో షాట్‌ కొట్టినా సామ్సన్‌ కనీసం పరుగు కోసం కూడా ప‍్రయత్నం చేయలేదు. చివరి బంతికి సిక్స్‌ కొడితేనే గెలుస్తారు. సామ్సన్‌ ప్రయత్నించాడు.. కానీ సిక్స్‌ రాలేదు.. ఇంచుమించు బౌండరీ లైన్‌ వద్దే దీపక్‌ హుడా క్యాచ్‌ పట్డడంతో సామ్సన్‌ ఓటయ్యాడు. రాజస్తాన్‌ నాలుగు పరుగుల తేడాతో ఓటమి చెందింది. 

కాగా, సామ్సన్‌ ఎందుకు సింగిల్‌కు ప్రయత్నించలేదుని ఒక చర్చకు దారి తీసింది. దీనిపై సోషల్‌ మీడియలో అయితే తీవ్రంగా చర్చ నడుస్తోంది. కానీ ఇక్కడ అంతా సామ్సన్‌ చేసింది కరెక్టే అని ఎక్కువ శాతం నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సామ్సన్‌ ఒక సెట్‌ అయిన బ్యాట్స్‌మన్‌, అందులోనూ సెంచరీ చేసి మంచి ఊపు మీద ఉన్నాడు. అటువంటప్పుడు అప్పుడే క్రీజ్‌లోకి వచ్చిన మోరిస్‌కు స్టైకింగ్‌ ఇచ్చే కంటే సామ్సన్‌ తాడో-పేడో తేల్చుకుంటేనే బెటర్‌. ఇక్కడ సామ్సన్‌ చేసింది కరెక్ట్‌’ అని అతనికి మద్దతుగా నిలుస్తున్నారు అధికశాతం  మంది నెటిజన్లు. మరొకవైపు మాజీ క్రికెటర్లు, కామెంటేర్లు కూడా సామ్సన్‌ చేసింది కరెక్టే అని అభిప్రాయపడుతున్నారు. 

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీస్కోరు చేసింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (50 బంతుల్లో 91; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగగా... దీపక్‌ హుడా (28 బంతుల్లో 64; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) హైలైట్స్‌ చూపించాడు. ఆ తర్వాత కొండంత లక్ష్యాన్ని చూసి రాజస్తాన్‌ రాయల్స్‌ జడిసిపోలేదు. హిట్టర్‌ స్టోక్స్‌ (0) తొలి ఓవర్లో డకౌటైనా కంగారు పడిపోలేదు. దిమ్మదిరిగే బదులిచ్చేందుకు రాజస్తాన్‌ పరుగూ పరుగూ పోగేసింది. బౌండరీలనూ జతచేసింది. సిక్సర్లతో వేగం పెంచుకుంది. పంజాబ్‌ కింగ్స్‌కు దడపుట్టించింది.  కేవలం నాలుగు పరుగుల దూరంలో ఆగిపోయి పరాజయం చెందింది రాజస్తాన్‌.

ఇక్కడ చదవండి: ఐపీఎల్‌ 2021: నా హార్ట్‌ బీట్‌ పెరిగిపోయింది

ఇంత బాగా రాణిస్తాడని అస్సలు ఊహించలేదు: సెహ్వాగ్

మరిన్ని వార్తలు