అక్కడ ఆడటానికి వెళ్లని మీరు.. ఐపీఎల్‌కు ఎలా వచ్చారు?

27 Apr, 2021 17:41 IST|Sakshi

లండన్‌: ఒకవైపు కరోనా వైరస్‌ భయపెడుతున్నా ఐపీఎల్‌ విజయవంతంగా పూర్తి కావడానికి ఎటువంటి ఇబ్బందుల ఉండకపోవచ్చని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ అభిప్రాయపడ్డాడు. కొంతమంది విదేశీ క్రికెటర్లు ఈ టోర్నీ నుంచి వైదొలుగుతున్నా ఐపీఎల్‌కు ఆటంకాలు ఉండకపోవచ్చన్నాడు. భారత్‌లో కరోనా తీవ్రంగా ఉన్నప్పటికీ  ఐపీఎల్‌ ద్వారా ప్రజలకు మంచి వినోదం లభిస్తుందన్నాడు. ఇది చాలా కష్టకాలమనే విషయం అందరికీ తెలిసినా ఐపీఎల్‌ బయోబబుల్‌ వాతావరణంలో సేఫ్‌గా జరుగుతూ అభిమానుల్లో మంచి జోష్‌ను నింపుతుందన్నాడు. 

ఇంకా దాదాపు ఏడువారాల పాటు ఇదే ఊపుతో ఐపీఎల్‌ సాగుతుందనే తాను ఆశిస్తున్నట్లు వాన్‌ పేర్కొన్నాడు. కాగా, ఐపీఎల్‌ను వీడి స్వదేశానికి వెళ్లిపోతున్న ఆసీస్‌, ఇంగ్లండ్‌ క్రికెటర్లపై వాన్‌ సెటైర్లు వేశాడు. గతంలో దక్షిణాఫ్రికాలో భయంకరమైన పరిస్థితులున్నాయని ఆ దేశ పర్యటనకు వెళ్లడానికి విముఖత చూపిన ఆసీస్‌, ఇంగ్లండ్‌ జట్ల క్రికెటర్లు.. భారత్‌లో ఐపీఎల్‌ ట్రేడింగ్‌కు ఎలా వచ్చారో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదన్నాడు. ఈ విషయంపై తాను ఎంతగా ఆలోచించినా అది కష్టంగానే ఉందన్నాడు. 

కాగా, ఈనెల 9వ తేదీన ప్రారంభమైన ఐపీఎల్‌.. మే 30వ తేదీ వరకూ జరుగనుంది. ఇంకా సుమారు ఏడువారాలు పాటు ఐపీఎల్‌ సాగనుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకూ విజయాలు సాధించిన జట్ల పరంగా చూస్తే చెన్నై సూపర్‌ కింగ్స్‌ టాప్‌లో కొనసాగుతోంది.  ఐదు మ్యాచ్‌లను పూర్తి చేసుకున్న ధోని అండ్‌ గ్యాంగ్‌.. నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. ఇక సన్‌రైజర్స్‌ ఐదు మ్యాచ్‌లకు గాను ఒకదాంట్లో మాత్రమే గెలుపు అందుకుని ఆఖరి స్థానంలో ఉంది. పేలవమైన ప్రదర్శన కారణంగా సన్‌రైజర్స్‌ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. 

ఇక్కడ చదవండి: భయపడొద్దు.. జాగ్రత్తగా పంపే బాధ్యత మాది: బీసీసీఐ
మాకు చార‍్టర్‌ విమానం వేయండి: సీఏకు లిన్‌ విజ్ఞప్తి

మరిన్ని వార్తలు