ఇంత స్కోరా... నేను అంతే:  ఏబీడీ

19 Apr, 2021 00:32 IST|Sakshi

చెన్నై: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్న ఏబీ డివిలియర్స్‌ తన ఇన్నింగ్స్‌పై సంతోషం వ్యక్తం చేశాడు. అదే సమయంలో కాస్త ఆశ్చర్యానికి గురైనట్లు ఏబీ తెలిపాడు. మ్యాచ్‌ తర్వాత అవార్డుల కార్యక్రమంలో ఏబీ మాట్లాడుతూ..‘ ఈ ఇన్నింగ్స్‌ నాలో సంతోషాన్ని తీసుకొచ్చింది. నా ముందు మ్యాక్స్‌వెల్‌ మంచి గేమ్‌ ఆడటంతో నేను ఫ్రీగా ఆడటానికి సహాయపడింది. ఈ తరహా ఇన్నింగ్స్‌ ఆడటానికి జట్టులోని సభ్యులు నాపై నమ్మకం ఉంచడమే. ఈ స్లో వికెట్‌పై బ్యాటింగ్‌ చేయడం కష్టం. నేను నమ్మదగ్గలేని ఆటను ఆడాను.

ఇది మంచి వికెట్‌.. కానీ ఇంత పెద్ద స్కోరు వచ్చే వికెట్‌ కాదు. 200 స్కోరు చేసే వికెట్‌ అయితే కాదు. నా బ్యాటింగ్‌ చూసి నేను ఆశ్చర్యపోయా. నాకు నేను కొన్నిసార్లు ఆశ్చర్యపోతా. మనం క్రీజ్‌లోకి వెళ్లాక అత్యుత్తమైన ఇన్నింగ్స్ ఆడేందుకు ప్రయత్నిస్తాం.  ఈ మ్యాచ్‌లో నా ఆటను నేను పూర్తిగా ఆస్వాదించడం అతి ముఖ్యం అనుకుంటా. నేను క్రికెట్‌ ఆడటాన్ని ఇష్టపడతా. ఆర్సీబీ తరఫున ఆడటం ఇంకా ఇష్టం.  ఆర్సీబీ నా కుటుంబం లాంటిది. చాలా ఏళ్లుగా ఈ జట్టుతో నాకు సంబంధం కొనసాగుతూనే ఉంది. క్రికెట్‌ను ఎక్కువ ఎంజాయ్‌ చేయడానికి చాలా కారణాలున్నాయి’ అని ఏబీ పేర్కొన్నాడు.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 205 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీకి మ్యాక్స్‌వెల్‌ (78; 49 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అదిరిపోయే ఇన్నింగ్స్‌తో అలరించగా, ఆపై ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఏబీ డివిలియర్స్ ‌(76 నాటౌట్‌; 34 బంతుల్లో 9 ఫోర్లు, 3సిక్స్‌లు) విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడాడు. కేకేఆర్‌ బౌలర్లపై విరుచుకుపడి స్కోరు బోర్డును రెండొందల పరుగులు దాటించాడు. కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి 38 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌లో ఆండ్రీ రసెల్‌ 31 పరుగలతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. షకీబ్‌ 26, మోర్గాన్‌ 29 పరుగులు చేశారు.

మరిన్ని వార్తలు