‘నాకైతే ఇంటి కంటే బయోబబుల్‌ సేఫ్‌’

26 Apr, 2021 21:31 IST|Sakshi

చెన్నై: తాను స్వదేశం వెళ్లడం కంటే ఇక్కడ ఐపీఎల్‌ బయోబబుల్‌ వాతావరణమే సేఫ్‌ అనిపిస్తోందని ముంబై ఇండియన్స్‌ కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆసీస్‌ బౌలర్‌ నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ పేర్కొన్నాడు. ఇప్పటికే ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆసీస్‌ బౌలర్లు ఆడమ్‌ జంపా, కేన్‌ రిచర్డ్‌సన్‌లు బయోబబుల్‌ వాతావరణాన్ని తట్టుiకోలేక స్వదేశానికి వెళ్లిపోవడానికి సన్నద్దమైన తరుణంలో కౌల్టర్‌నైల్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. ​క్రికెట్‌ డాట్‌ కమ్‌ ఏయూతో మాట్లాడిన కౌల్టర్‌నైల్‌...‘ ప్రతీ ఒక్కరికి సొంత అభిప్రాయాలుంటాయి. వారికుండే పరిస్థితుల్ని బట్టే వారి నిర్ణయాలు ఉంటాయి. 

ఆడమ్‌ జంపా తిరిగి స్వదేశానికి వెళ్లిపోవడానికి సిద్దపడటం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆపై రిచర్డ్‌సన్‌ ఈ నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. వారితో మాట్లాడితే విషయం అర్థమవుతుంది. నేను జంపాతో మాట్లాడాను. వెళ్లాల్సిన పరిస్థితుల్లో తప్పక వెళ్లాల్సి వస్తుందన్నాడు. జంపా, రిచర్డ్‌సన్‌ నిర్ణయాలను గౌరవిస్తున్నా. నాకైతే బయోబబుల్‌ వాతావరణం బాగుంది. ఇంటికి వెళ్లాలనే ప్రయత్నం చేయడం,  ఇంటికి వెళ్లడం కంటే ఇక్కడే సేఫ్‌ అనిపిస్తోంది’ అని తెలిపాడు.ఈ సీజన్‌లో కౌల్టర్‌నైల్‌ ఇంకా ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. ముంంబై ఇండియన్స్‌ పేస్‌ విభాగంగా బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌, ఆడమ్‌ మిల్నేలతో బలంగా ఉండటంతో కౌల్టర్‌నైల్‌ ఇంకా ఆడే అవకాశం రాలేదు.

మరిన్ని వార్తలు