ఒక్క విజయం.. అంతే హోటల్‌ రూంకు వేగంగా పరిగెత్తా

14 Apr, 2021 13:55 IST|Sakshi
కర్టసీ: ముంబై ఇండియన్స్‌ ట్విటర్‌

చెన్నై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో కేకేఆర్‌పై విజయం సాధించడం ద్వారా ముంబై ఇండియన్స్‌ లీగ్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ముంబై స్పిన్నర్‌ రాహుల్‌ చహర్‌ 4 వికెట్లతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. ముంబై ఇచ్చిన 152 పరుగుల సాధారణ విజయలక్ష్యాన్ని కేకేఆర్‌ చేధించలేక 7 వికెట్లు కోల్పోయి 142 పరుగుల వద్దే ఆగిపోయి 10 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ ఆటగాడు జేమ్స్‌ నీషమ్‌ తన ట్విటర్ ద్వారా ఒక ఫన్నీ వీడియోను షేర్‌ చేశాడు. ఆ వీడియోలో ఫారెస్ట్‌ గంప్‌ సినిమాలో హీరో టామ్‌ హాంక్స్‌ సంతోషం వస్తే ఎవరి మాట వినకుండా ఎలా పరిగెడతాడో..  మేము కూడా ఈరోజు కేకేఆర్‌పై విజయం సాధించిన తర్వాత హోటల్‌ రూంకు అంతే వేగంగా పరిగెత్తాము. అంటూ ట్వీట్‌ చేశాడు. కాగా గతేడాది సీజన్‌లో నీషమ్‌ కింగ్స్‌ పంజాబ్‌కు ఆడగా.. ఈసారి వేలంలో ముంబై ఇండియన్స్‌ అతన్ని కనీస మద్దతు ధరకే(రూ. 50లక్షలు) కొనుగోలు చేసింది.

ఇక మ్యాచ్‌ విజయం అనంతరం.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ఇది కంప్లీట్‌ టీమ్‌ ఎఫర్ట్‌ అని అన్నాడు. ప్రత్యేకంగా ఈ ఘనత బౌలర్లదేనని, ఇక బ్యాటర్స్‌గా తాము మంచి ప్రదర్శన చేయాల్సి ఉందన్నాడు. చెన్నైలో తొలి బంతి నుంచి హిట్‌ చేసే పరిస్థితులు ఉండటం లేదని, ఇది చెన్నైలోని చెపాక్‌లో ఒక ట్రెండ్‌లా కొనసాగుతోందన్నాడు. ఇక్కడ బ్యాటింగ్‌కు క్రీజ్‌లోకి వచ్చే ముందే ఎలా ఆడాలనేది ప్లాన్‌ చేసుకుని రావాలన్నాడు. మా బౌలర్‌ రాహుల్‌ చహర్‌ అద్భుత బౌలింగ్‌ కనబరిచాడు. 4 వికెట్లతో సత్తా చాటిన అతను కీలక సమయాల్లో వికెట్లు తీయడంతో మా పని సులువైందని పేర్కొన్నాడు. తామింకా 15-20 పరుగులు చేయాల్సిందని, ఆఖరి ఓవర్లలో అనుకున్న పరుగులు రాలేదన్నాడు. డెత్‌ ఓవర్లలో బ్యాటింగ్‌ ఎలా చేయాలనే దానిపై కూడా ఫోకస్‌ చేస్తామన్నాడు. కాగా ముంబై ఇండియన్స్‌ తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 17న సన్‌రైజర్స్‌తో ఆడనుంది.
చదవండి: ఏడేళ్ల తర్వాత రోహిత్‌.. ఇది వ్యూహం కాదంటారా?

>
మరిన్ని వార్తలు