ఒకవైపు ఓటమి.. మరొకవైపు ధోనికి భారీ జరిమానా

11 Apr, 2021 15:00 IST|Sakshi
మ్యాచ్‌ తర్వాత ఢిల్లీ ఆటగాళ్లు, స్టాఫ్‌ మెంబర్స్‌తో ధోని కరాచలనం(ఫోటో: ఐపీఎల్‌)

ముంబై: ఈ ఐపీఎల్‌-14 సీజన్‌లో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓటమి పాలైన విషయం తెలిసిందే. సీఎస్‌కే 189 పరుగుల టార్గెట్‌ను ఢిల్లీ ముందు ఉంచినా ఢిల్లీ జట్టు అవలీలగా లక్ష్యం చేధించింది. దీంతో టోర్నీలో ఢిల్లీ శుభారంభం చేయగా చెన్నై ఓటిమితో టోర్నీ ప్రారంభించాల్సి వచ్చింది. ఇలా ఓ వైపు ఓటమితో బాధపడుతుంటే ధోని జట్టుకు మరో షాక్‌ తగిలింది. వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ధోనికి భారీ జరిమానా విధించారు. ‘శనివారం రాత్రి వాంఖడేలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే టీమ్‌ స్లో ఓవర్‌ రేట్‌ను కనబరించింది. ఈ కారణంగానే ధోనికి రూ.12 లక్షల జరిమానా విధించాం’ అని ఐపీఎల్‌ యాజమాన్యం  అధికారికంగా వెల్లడించింది. 

ఐపీఎల్ రూల్స్ ప్రకారం గంటకు 14.1 ఓవర్లు బౌలింగ్ కోటా పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో 90వ నిమిషంలోపుగానీ, ఆ సమయానికి 20వ ఓవర్ బౌలింగ్ ప్రారంభించాలి. ఒకవేళ సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ రెండవ తప్పిదం జరిగితే రూ.24 లక్షల జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఇతర జట్టు ఆటగాళ్లు ఒక్కొక్కరికి రూ.6 లక్షలుగానీ, లేదా మ్యాచ్‌ ఫీజులో 25 శాతం ఫీజు  జరిమానా విధిస్తారు.  మూడోసారి తప్పిదం జరిగితే కెప్టెన్ ఎంఎస్ ధోనిపై ఒక మ్యాచ్ నిషేధంతో పాటు రూ.30 లక్షల జరిమానా, ఆటగాళ్లకు రూ.12 లక్షలు లేదా 50 శాతం మ్యాచ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే తొలి మ్యాచ్‌లోనే ఓడిపోవడం పట్ల ధోని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్‌ అనంతరం అవార్డుల కార్యక్రమంలో మ్యాచ్‌లో విఫలం చెందడం పట్ల పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా ధోని మాట్లాడుతూ.. ‘మ్యాచ్‌ 7.30 గంటలకు ప్రారంభం కావడంతో ప్రత్యర్థి జట్టు మమ్మల్ని తీవ్రంగా దెబ్బకొట్టింది. ఈ పిచ్‌ చాలా పేలవంగా ఉండటంతో తొలుత బ్యాటింగ్‌ కష్టంగా మారింది. ఇక్కడ మాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. పిచ్‌పై డ్యూ (తేమ) కనబడింది. అది తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టుపై చాలా ప్రభావం చూపుతుంది. పిచ్‌పై మంచు ఉంటే అది ఛేజింగ్‌ జట్టుకే అనుకూలంగా ఉంటుందనేది కాదనలేని వాస్తవం.

ఎప్పుడైనా తేమ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలనుకున్నాం. ఇంకా 15-20 పరుగులు చేస్తే బాగుండేది. తదుపరి మ్యాచ్‌లకు ఈ మ్యాచ్‌ ఒక గుణపాఠం’ అని చెప్పుకొచ్చాడు ధోని. ఇక ఢిల్లీ బౌలర్ల గురించి మాట్లాడుతూ.. ఢిల్లీ బౌలర్లు మంచి లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో బంతులు వేశారు. ఈ తరహా పిచ్‌పై ఏ బంతులు వేయాలో అవే వేసి విజయవంతమయ్యారు. మా ఓపెనర్లకు ఢిల్లీ బౌలర్లు వేసిన బంతులు నిజంగా అద్భుతం’ అని ధోని పేర్కొన్నాడు. 

ఇక్కడ చదవండి: ‘అది మాకు సానుకూలాంశం..  తక్కువ అంచనా వేయొద్దు’

మా మదిలో అదే ఉంది: అదే మా కొంప ముంచింది.: ధోని

>
మరిన్ని వార్తలు