చెన్నై: ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ ట్రోఫీని ఐదుసార్లు గెలిచి చరిత్ర సృష్టించిన జట్టు. ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో అత్యధికంగా టైటిల్స్ సాధించి ఎవరికీ అందనంత దూరంలో ఉంది. కాగా, ఐపీఎల్-14 సీజన్లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆర్సీబీ-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ ముందుగా ముంబైను బ్యాటింగ్కు ఆహ్వానించాడు.
ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య చెపాక్ రికార్డు ఎలా ఉందనేది తెరపైకి వచ్చింది. చెపాక్ స్టేడియంలో ముంబైదే పైచేయిగా ఉంది. ప్రధానంగా చెపాక్లో ముంబై ఆడిన చివరి ఐదు మ్యాచ్ల్లో విజయం సాధించగా, ఆర్సీబీ ఇక్కడ ఆడిన చివరి ఐదు మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. మరి ఇక్కడ వరుస విజయాలతో ఉన్న ముంబై ఈసారి కూడా గెలిస్తే తన రికార్డును మరింత మెరుగుపరుచుకుంటుంది.
అయితే చెపాక్ స్టేడియంలో ఆర్సీబీ చివరిసారి విజయం సాధించింది 2011లో. అది కూడా ముంబై ఇండియన్స్పైనే ఆర్సీబీ గెలిచింది. ముంబైతో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో ఆర్సీబీ 43 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 185 పరుగులు చేయగా, ముంబై 142 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. దాంతో ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించగా, ఆర్సీబీ ఫైనల్కు చేరింది. ఆ సీజన్లో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియల్ వెటోరి ఆర్సీబీకి కెప్టెన్గా చేశాడు.
ఇక్కడ చదవండి: అందుకే మ్యాక్సీ కోసం అంత పట్టుబట్టాం: కోహ్లి